ఎన్నికల్లో లబ్ది పొందేందుకు పవన్ కల్యాణ్, తన సినిమాల్ని ఎలా వాడుకుంటున్నారో అందరికీ తెలిసిందే. ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు టీజర్లు వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నంను కూడా బరిలోకి దించారు పవన్. అతడ్ని ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
అలా అని రాష్ట్రం మొత్తాన్ని ఆయన చేతిలో పెట్టలేదు. తిరుపతి నియోజకవర్గంపై మాత్రమే ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అంటే దీనర్థం, ఈ వారం రోజుల పాటు ఆయన తిరుపతిలోనే ఉంటారు. ఇంకాస్త లోతుగా చూస్తే, ఆయన పదవి ఈ 7 రోజులు మాత్రమే. 13వ తేదీ తర్వాత తిరిగి ఆయన నిర్మాత ఏఎం రత్నంగా మారతారు.
అయితే ఉన్నఫలంగా రత్నంను ఎందుకు ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు, ప్రత్యేకంగా తిరుపతికే ఎందుకు పరిమితం చేశారనేది ఆలోచించదగ్గ విషయం. పైగా కోట వినుతను తిరుపతి ఎన్నికల సమన్వయకర్తగా కూడా నియమించారు. వీళ్లిద్దరూ కలిసి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించాలన్నమాట.
హరిహర వీరమల్లు సినిమా పేరిట ఇప్పటికే ఏఎం రత్నంను దాదాపు మూడేళ్లుగా తన వెంట తిప్పుకుంటున్నారు పవన్. ఇప్పుడీ కొత్త బాధ్యత ఒకటి. ఏఎం రత్నంను పవన్ ఇలా ఇరికించారా లేక ప్రాధాన్యత ఇచ్చారా అనేది వాళ్లిద్దరికి మాత్రమే తెలిసిన విషయం.
తెర వెనక ఏం జరిగిందనేది పక్కనపెడితే, పవన్ ఏం చెబితే రత్నం అది చేయాల్సిందే. ఆయనకు మరో ఆప్షన్ లేదిక్కడ. కనీసం ఈసారైనా తన సినిమాకు పవన్ కాల్షీట్లు కేటాయిస్తే బయటపడాలని చూస్తున్నారు ఈ నిర్మాత.