ఏపీ పరిధిలో అసెంబ్లీ, లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు రేటు గరిష్టంగా పలుకుతున్న నియోజకవర్గంగా విశాఖ ఎంపీ సీటు నిలుస్తోంది. పోలింగ్ కు ఇంకా పది రోజుల ముందే ఇక్కడ నోట్ల కట్టలు తెగుతున్నాయనే టాక్ వస్తోంది. విశాఖ ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్ నిలుస్తున్న సంగతి తెలిసిందే! ఒకవైపు ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక గాలులు వీస్తున్నాయి! ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ భారీ వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఉంది. 34 అసెంబ్లీ సీట్లున్న ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ పరువు నిలుపుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం ఇక్కడ ఏవేవో లెక్కలేసుకున్నా.. ఇక్కడ జగన్ వేవ్ బలంగా కనిపిస్తోంది.
ఇక విశాఖ ఎంపీ సీటు పరిధిలో అయితే పరిస్థితి సరేసరి! గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన శ్రీభరత్ ఈ సారి ఖర్చు విషయంలో వెనుకాడటం లేదనే వార్తలు వస్తున్నాయి. ఒకవైపు విశాఖ ఎంపీ సీటు పరిధిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు భారీ ఎత్తున ఖర్చులు చేస్తూ ఉన్నారు. ఖర్చు విషయంలో భరత్ బాహాటంగానే వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీకి భారీగా ఖర్చు అవుతోందంటూ ఆయన నిట్టూర్చారు! ఇలా తనకే బాధ కలిగించేంత స్థాయిలో భరత్ ఖర్చు పెడుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
విశాఖ పరిధిలో గీతమ్ భూముల వివాదాలున్నాయి. ప్రభుత్వ భూములను ఆక్రమించి వర్సిటీ నిర్మాణాలు చేపట్టారు అనే అంశం కోర్టుల వరకూ చేరింది. గీతమ్ భూములు ఆక్రమించిందని, ఆక్రమణలోని భూములను స్వాధీనం చేసుకోవడం తథ్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిర్మాణాలు విలువైనవి అనుకుంటే.. ఆక్రమణలకు ప్రతిగా ప్రభుత్వానికి భూములను సరెండర్ చేసి వీటిని రెగ్యులరైజేషన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ వివాదంపై భరత్ కుటుంబం కోర్టును ఆశ్రయించింది.
ఇలాంటి పరిస్థితుల్లో ఆక్రమణలను కాపాడుకోవడం విషయంలో కూడా భరత్ కు ఎంపీగా గెలవడం ఒక మార్గంగా భావిస్తున్నట్టుగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో వందల కోట్ల విలువ చూసే భూములను కాపాడుకోవాలంటే ఇప్పుడు ఖర్చులకు వెనుకాడకూడదనే లెక్కలను వేసుకున్నట్టుగా ఉన్నారు!
ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విశాఖ నుంచి బొత్స ఝాన్సీ బరిలో ఉన్నారు. భరత్ ను ఢీ కొట్టడం అంటే మాటలు కాకపోయినా.. సర్వేలు తమకు అనుకూలంగా ఉన్నాయనే మాట ఈ శిబిరం నుంచి వినిపిస్తూ ఉంది. విశాఖ నగర పరిధిలో సామాన్యులకు జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయనే ధీమా వీరిలో కనిపిస్తోంది. తెలుగుదేశం ఎన్ని అస్త్రాలను సంధించినా, కుయుక్తులు పన్నినా విశాఖలో విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అనే ధీమా వీరి నుంచి వ్యక్తం అవుతోంది. లోక్ సభలో యాక్టివ్ గా ఉంటూ.. ఉత్తమ పార్లమెంటేరియన్ గా నిలిచిన ఝాన్సీ నగర ఓటరును కూడా ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.