పెట్రోల్‌ సెంచరీనా? డబుల్‌ సెంచరీనా.?

బ్యారెల్‌ ముడి చమురు ధర 120 డాలర్లు.. లీటర్‌ పెట్రోల్‌ ధర 70 రూపాయలు.. 

ఈ లెక్కన బ్యారెల్‌ ముడి చమురు ధర 30 డాలర్లకు పడిపోయినప్పుడు, లీటర్‌ పెట్రోల్‌ ధర ఎంత వుండాలి.? లెక్క ప్రకారం అయితే, 20 రూపాయల లోపే వుండాలి. కానీ, 60 రూపాయలకు ఏనాడూ తగ్గలేదు పెట్రోల్‌ ధర గడచిన రెండేళ్ళలో. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు అత్యంత కనిష్ట స్థాయికి పతనమైనాసరే, ఆ స్థాయిలో వాహనదారులకు ఉపశమనం కల్పించలేదు నరేంద్రమోడీ ప్రభుత్వం. 

కాంగ్రెస్‌ హయాంలో పెట్రోధరలు పెరిగితే, బీజేపీ రోడ్డెక్కి ఆందోళనలు చేసింది. అప్పట్లో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భగ్గున మండటంతో, దానికి తగ్గట్టుగా దేశంలో పెట్రోల్‌ ధరలు పెరిగాయి. కానీ, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గాక కూడా, ఆ వెసులుబాటు దేశ ప్రజలకు కల్పించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం ముడి చమురు ధరలు 50 డాలర్ల మార్క్‌ని దాటేసింది. పెట్రోల్‌ ధర తాజా పెంపుతో 70 దాటేసింది. 

భవిష్యత్తులో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఇంకా ఇంకా పెరిగే అవకాశముందన్న ప్రచారం నేపథ్యంలో, దేశంలో పెట్రోధరలపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదివరకటి స్థాయిలో 120 డాలర్లకు బ్యారెల్‌ ముడి చమురు ధర చేరుకుంటే, దేశంలో పెట్రోల్‌ ధరలు సెంచరీ దాటేయడం కాదు, డబుల్‌ సెంచరీని చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదేమో.! 

చిత్రంగా ఇదివరకట్లా పెట్రోధరలపై ఏ రాజకీయ పార్టీ కూడా రోడ్డెక్కి ప్రజల తరఫున ఆందోళనలు చేయడంలేదు. అంతకన్నా విచిత్రమేంటంటే, వామపక్షాలు కూడా సైలెంటయిపోవడం. 

Show comments