హైదరాబాద్ ఎయిర్ పోర్టులో అసలేం జరుగుతోంది?

హైదరాబాద్ విమానాశ్రయం కిక్కిరిసిపోయింది. ఉదయం 9 గంటల ఫ్లయిట్ అందుకోవాల్సిన ప్రయాణికులు, ఇంకా క్యూ లైన్ లో పడిగాపులు పడుతున్నారు. మధ్యాహ్నం విమానాలు అందుకోవాల్సిన వాళ్లు, విమానాశ్రయం బయటే వేచి చూడాల్సిన పరిస్థితి. ఎయిర్ పోర్టులో ఒక్క బోర్డ్ కూడా కనిపించలేదు.

మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవల్లో అంతరాయం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవల్లో జరిగిన అంతరాయం వల్ల హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ పై కూడా ఆ ప్రభావం పడింది. డిస్ ప్లే బోర్డులు పనిచేయలేదు, సర్వర్లు నిలిచిపోయాయి.

దీంతో చాలామందికి బోర్డింగ్ పాసులు అందలేదు. సిబ్బంది చేతితో బోర్డింగ్ పాసులు రాసి క్లియర్ చేస్తున్నారు. తాజా అంతరాయం కారణంగా రావాల్సిన విమానాలు, వెళ్లాల్సిన విమానాలు కలిపి మొత్తంగా 23 సర్వీసులు రద్దయ్యాయి.

బెంగుళూరు, తిరుపతి, విశాఖపట్నం, భువనేశ్వర్, రాయ్ పూర్, జైపూర్, కొచ్చిన్, కోయంబత్తూర్, తిరువనంతపురం, అహ్మదాబాద్, భువనేశ్వర్ సర్వీసులపై ప్రభావం గట్టిగా పడింది. చాలా మంది ప్రయాణికులు తమ లగేజీలు చెక్-ఇన్ చేసుకోలేక, బోర్డింగ్ పాసులు పొందలేక పొడవాటి క్యూ లైన్లలో వేచి ఉన్నారు. చాలామంది తమ ప్రయాణాలు ఉన్నఫలంగా రద్దు చేసుకున్నారు. Readmore!

మైక్రోసాఫ్ట్ కు సైబర్ సెక్యూరిటీ అందించే క్రౌడ్ స్ట్రయిక్ అనే ఫ్లాట్ ఫామ్ లో సమస్య తలెత్తినట్టు ప్రాధమికంగా గుర్తించారు. భారత్ తో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, బ్రిటన్ దేశాలపై ప్రభావం ఎక్కువగా పడింది. విమాన సర్వీసులతో పాటు అత్యవసర సేవలు, వైద్య సేవలపై కూడా ఈ ప్రభావం పడింది.

Show comments