చైతూ 'యుద్ధం' మొదలుపెట్టేస్తున్నాడు

నెల రోజులు వుంది. చైతూ కొత్త సినిమా థియేటర్లలోకి రావడానికి. అందుకే ఇప్పటి నుంచే ప్రచారం షురూ చేస్తున్నాడు. ఈ సినిమా మీద నాగ్ చైతన్య చాలా ఇంట్రెస్ట్ గా వున్నాడు. దానికి తగిన కారణం వుంది. ఈ సినిమా ప్రాజెక్ట్ అమ్మ ఇంటివైపు నుంచి వచ్చింది. వాస్తవానికి చైతూ మామయ్య సురేష్ బాబు ఈ కథ విని, తనే చేయాలనుకుని అనుకున్నారు. అయితే చైతన్య ఓ సినిమా సాయి కొర్రపాటికి చేయాలనుకోవడం, అది వాయిదాపడడం అయ్యింది. అడ్వాన్స్ వెనక్కు ఇస్తానంటే, సాయి కొర్రపాటి తీసుకోలేదు. ఎప్పటికైనా కలసి మంచి సినిమా చేద్దాం, హర్రీ లేదు అన్నారు. 

ఆ పద్ధతి నచ్చి, చైతూ ఈ ప్రాజెక్టును ఆయన చేతిలో పెట్టాడు. అది ఓ రీజన్. ఇంక మరో రీజన్ సినిమా జోనర్. కాస్త థ్రిల్లర్ జోనర్ తో వుంటూనే, మాస్ ప్లస్ క్లాస్ టచ్ వున్న సినిమా ఇది. రొమాంటిక్ సినిమాల్లో చైతూకి ఫెయిల్యూర్ లేదు. అందుకే ఇప్పుడు ఈ జోనర్ లో కూడా హిట్ కొట్టాలనుకుంటున్నాడు. ఈ సినిమాలో చైతూ డ్రోన్స్ స్పెషలిస్ట్ గా కనిపిస్తాడు. 

కమింగ్ టు పబ్లిసిటీ పాయింట్, ఈ నెల 27 నుంచి యుద్ధం శరణం పబ్లిసిటీకి శ్రీకారం చుడుతున్నారు. ఈ వీకెండ్ లో కానీ తరువాతి వారం ఆరంభంలో కానీ టీజర్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక అక్కడి నుంచి మూడువారాల పాటు చురుగ్గా ప్రచార సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత సాయి కొర్రపాటి, హీరో నాగ్ చైతన్య. ఇంకో విశేషం ఏమిటంటే, ఈ సినిమాకు ప్రొడక్షన్ వ్యవహారాలు అన్నీ దర్శక దిగ్గజం రాజమౌళి కుమారుడు కార్తికేయ హ్యాండిల్ చేయడం.

Show comments