కుర్రాడి కోటి ఆశలు.. కృష్ణవంశీ తీర్చుతాడా.?

నో డౌట్‌.. తెలుగు సినీ పరిశ్రమలో 'క్రియేటివ్‌ డైరెక్టర్‌' అని పిలవదగ్గ అతి కొద్దిమంది దర్శకుల్లో కృష్ణవంశీ పేరు ఖచ్చితంగా ముందు వరసలో వుంటుంది. కానీ, ఎంత క్రియేటివ్‌ డైరెక్టర్‌ అయినా.. ఇటీవలి కాలంలో సరైన విజయాలు అందుకోలేకపోతున్నాడు కృష్ణవంశీ. కరువు తీరా సెన్సేషనల్‌ హిట్‌ కొట్టేందుకోసమంటూ 'నక్షత్రం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు కృష్ణవంశీ రాబోతున్నాడు. 

ఇక, ఈ సినిమాకి సంబంధించిన ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. రెజినా, సందీప్‌ కిషన్‌ జంటగా నటించిన ఈ చిత్రంలో సాయిధరమ్‌ తేజ 'కీలక పాత్ర'లో కనిపిస్తాడు. అంతేనా.? 'నచ్చావులే' ఫేం తనీష్‌, ఈ సినిమాతో విలన్‌గా మారాడు. సందీప్‌ కిషన్‌, రెజినా, సాయిధరమ్‌.. వీళ్ళంతా ఒక ఎత్తు, తనీష్‌ ఓ ఎత్తు. అవును నిజం, ఈ సినిమా తనకు అత్యంత ప్రతిష్టాత్మకం అంటున్నాడు తనీష్‌. 

హీరో గోపీచంద్‌ ఒకప్పుడు విలన్‌గా నటించాడు. ఆ మాటకొస్తే, మోహన్‌బాబు విలన్‌ పాత్రల్లో నటించలేదా.? చిరంజీవి కూడా అంతే. శ్రీకాంత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది.? ఆ లెక్కన, తెలుగు సినిమా పరిశ్రమలో విలన్లు హీరోలుగా, హీరోలు విలన్లుగా మారడం కొత్తేమీ కాదు. హీరోగా తొలి సినిమాతో ఫెయిల్యూర్‌ చవిచూసి, విలన్‌గా సక్సెస్‌ అయి హీరోగా మారిన గోపీచంద్‌లానే, తానూ 'నక్షత్రం' సినిమాతో మంచి పేరు తెచ్చుకుంటానని తనీష్‌ చెబుతున్నాడు. 

మరి, తనీష్‌ అంచనాలు నిజమవుతాయా.? తనీష్‌ ఆశల్ని కృష్ణవంశీ నిజం చేస్తాడా.? 'నక్షత్రం' విడుదలయ్యేదాకా వేచి చూడాల్సిందే.

Show comments