చిరు, పవన్‌ మౌనం.. అయినాగానీ..

చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ ఓ సినిమాలో నటించనున్నారట.. అది మల్టీస్టారర్‌ కానుందట. ఆ సినిమాకి కాంగ్రెస్‌ నేత, రాజ్యసభ సభ్యుడు, ఒకప్పటి సినీ నిర్మాత సుబ్బిరామిరెడ్డి నిర్మాత కానున్నారట.. అంతే కాదు, అశ్వనీదత్‌ ఈ చిత్రానికి సహ నిర్మాత అట. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుందట.! 

అబ్బో, ఇన్ని 'అట'లు ఏమిటట.? ఇంతకీ, ఈ కాంబినేషన్‌ వర్కవుట్‌ అవుతుందా.? లేదా.? ఏమోగానీ, ఖచ్చితంగా వర్కవుట్‌ చేసి తీరతానంటున్నారు సుబ్బిరామిరెడ్డి. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందించే ఆ చిత్రం కోసం పవన్‌, చిరంజీవి సుముఖంగానే వున్నారని ఆ మధ్య సుబ్బిరామిరెడ్డి చెప్పుకొచ్చారు. కానీ, ఈ వ్యవహారంపై ఇప్పటిదాకా చిరంజీవి స్పందించలేదు. పవన్‌కళ్యాణ్‌ అయితే, నవ్వి ఊరుకున్నారు. ప్రస్తుతానికి అలాంటి ప్రతిపాదనలు తన దగ్గరకు రాలేదనేశారాయన. 

'ఎవరికీ అనుమానాలు అక్కర్లేదు.. ఈ కాంబినేషన్‌ ఖచ్చితంగా వర్కవుట్‌ అవుతుంది.. కథ రెడీ అవగానే, సినిమాని పట్టాలెక్కించేస్తాం..' అంటూ సుబ్బిరామిరెడ్డి తాజాగా మరోమారు మెగా - పవర్‌ కాంబినేషన్‌పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. చిరంజీవి, సురేందర్‌రెడ్డి డైరెక్షన్‌లో ఓ సినిమా చేయాల్సి వుంది. పవన్‌కళ్యాణ్‌కి అయితే ఖాళీనే లేదు.. వరుస సినిమాలతో బిజీగా వున్నాడాయన. ఈ పరిస్థితుల్లో సుబ్బిరామిరెడ్డి, మెగా - పవర్‌ సినిమా.. అంటూ పబ్లిసిటీ స్టంట్లు చేస్తుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. ఇదాయనకు ప్రెస్టీజ్‌ ఇష్యూగా మారిపోయినట్టుంది.

Show comments