ఎన్టీఆర్, రామ్ చరణ్.. జోరుగా హుషారుగా..!

నందమూరి హీరో ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్ ఇద్దరూ తమ సినిమాలతో ఫుల్ స్వింగ్ మీదున్నారు. సుకుమార్ దర్శకత్వంలో చెర్రీ చేస్తున్న సినిమాతో పాటు.. బాబి దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న జై లవకుశ మూవీపై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ రెండు సినిమాల షెడ్యూల్స్ ఈరోజు నుంచే మళ్లీ మొదలయ్యాయి.

మొన్నటివరకు రాజమండ్రి, పోలవరం, కొల్లేరు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశాడు చరణ్. మండే ఎండల్లో దాదాపు నెల రోజుల పాటు షూటింగ్ చేసి ఈమధ్యే స్మాల్ గ్యాప్ తీసుకున్నారు. ఈరోజు నుంచి ఈ సినిమాకు సంబంధించి సెకెండ్ షెడ్యూల్ మొదలైంది. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి రేపల్లె అనే టైటిల్ అనుకుంటున్నారు.

మరోవైపు ఎన్టీఆర్ కూడా జై లవకుశ షెడ్యూల్ స్టార్ట్ చేశాడు. ఓ 10 రోజుల విరామం తర్వాత ఇవాళ్టి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వచ్చింది. పురాతన భవనం సెట్ వేసి అందులో ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వెల్ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. రాశిఖన్నా, నివేద థామస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో నందిత రాజ్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది.

Show comments