మొన్న నదియ.. తాజాగా ఖుష్బూ

పవన్ కల్యాణ్ – త్రివిక్రమ్ సినిమా కోసం సీనియర్ నటి ఖుష్బూను తీసుకున్న విషయం తెలిసిందే. ఈరోజు నుంచి ఆమె సెట్స్ పైకి వచ్చారు. ప్రస్తుతం పవన్-ఖుష్బూ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని ఖుష్బూ స్వయంగా వెల్లడించారు. పవన్ కల్యాణ్ సినిమా సెట్స్ పైకి వచ్చానని, మొదటి రోజు స్కూల్ కు వెళ్లిన అనుభూతి కలిగిందని ట్వీట్ చేశారు.

గతంలో పవన్ – త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో కీలకపాత్ర పోషించారు నదియ. సినిమాలో ఆ క్యారెక్టర్ ఎంత క్లిక్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అలాంటిదే మరో పవర్ ఫుల్ పాత్రను ఖుష్బూకు ఆఫర్ చేశాడట త్రివిక్రమ్. తెలుగులో సెలక్టివ్ గా సినిమాలు చేసే ఖుష్బూ... త్రివిక్రమ్ చెప్పిన క్యారెక్టరైజేషన్ చాలా స్పెషల్ గా ఉండడం వల్లనే ఒప్పుకున్నట్టు తెలిపారు. సెట్స్ లో తనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయని చెప్పిన ఖుష్బూ.. ఈ సినిమా కోసం హైదరాబాద్ లోనే 10 రోజుల పాటు ఉండబోతున్నారు.

తెలుగులో స్టాలిన్, యమదొంగ సినిమాల తర్వాత ఖుష్బూ చేస్తున్న మూవీ ఇదే. స్టాలిన్ లో చిరంజీవికి సిస్టర్ గా, యమదొంగలో యముడి భార్యగా నటించిన ఖుష్బూ... పవన్ కల్యాణ్ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ లో కనిపించబోతున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Show comments