నల్లధనాన్ని వెలికి తీయాల్సిందే.. అందుకోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. నోట్ల రద్దుని దేశమంతా స్వాగతిస్తోంది. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. కానీ, ఆ రద్దు ప్రక్రియ మాత్రం వివాదాస్పదమవుతోంది. దేశంలో కరెన్సీ కొరతని సృష్టించి, సామాన్యుడ్ని రోడ్డున పడేసిన వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెద్దలు ముందస్తుగానే జాగ్రత్తపడిపోయిన దరిమిలా, నల్లధనమ్మీద నరేంద్రమోడీ చేస్తున్న పోరాటం, నిజానికి ఆరాటంగా మారిపోయిందన్నది నిర్వివాదాంశం.
ఇక, నల్లధనానికి సంబంధించి నరేంద్రమోడీ చేసిన తాజా వ్యాఖ్యలు నెటిజన్లకు భలే ఎంటర్టైనింగ్గా మారిపోయాయి. 'నేను దేశం కోసం కుటుంబాన్ని త్యాగం చేశాను.. మీరూ త్యాగాలకు సిద్ధమవ్వండి..' అంటూ నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపుపై నెటిజన్లు తమకు తోచిన విధంగా స్పందిస్తున్నారు. 'నిజమే, దేశంలో ప్రతి ఒక్కరూ త్యాగాలకు సిద్ధమవ్వాలి.. తమ తమ కుటుంబాల్ని త్యాగం చేసెయ్యాలి.. అందరూ సన్యాసం తీసుకోవాలి..' అంటున్నారు మెజార్టీ నెటిజన్లు.
అంతే మరి, మార్కెట్లో నోట్ల కొరత పెరిగిపోయినప్పుడు, క్యూ లైన్లలో గంటల తరబడి వంద నోటు కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడినప్పుడు, కుటుంబ అవసరాలు ఎలా తీరతాయి.? నో ఛాన్స్. ఈ పరిస్థితుల్లో సన్యాసమొక్కటే మార్గమన్నది నెటిజన్ల మాట. నెటిజన్లే కాదు, ఏటీఎం సెంటర్ల వద్ద, బ్యాంకుల వద్ద క్యూలైన్లలో నిల్చున్న సామాన్యుల నుంచి ఇదే భావన వ్యక్తమవుతోంది.
నరేంద్రమోడీ వివాహం చేసుకున్నా, భార్యకు దూరంగా వుంటున్నారాయన. బహుశా ఆయనకు అందుకేనేమో, కుటుంబ కష్టాలు తెలిసిరావడంలేదని నెటిజన్లు, సాధారణ ప్రజానీకం స్పందిస్తున్న ప్రశ్నలకు కరడుగట్టిన బీజేపీ సపోర్టర్స్ కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడీ 'మోడీ సన్యాసం' అనే అంశం రానురాను ట్రెండింగ్గా మారుతోంది.