నవ్వొద్దు: కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఈయనేనట!

అసలు జానా రెడ్డి కాంగ్రెస్ లోనే ఉండడు.. ఎమ్మెల్యేలందరినీ తెరాసలోకి చేర్చిన తర్వాత ఆయనే తెరాసలోకి జంప్ అయిపోతాడని కొంతమంది పందెం కాస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఎర్రబెల్లి దయాకర్ రావు పోషించిన పాత్రనే ప్రస్తుతం కాంగ్రెస్ లో జానా రెడ్డి పోషిస్తున్నాడని కొంతమంది కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. 

సీఎల్పీ లీడర్ హోదాలో ఉన్న వ్యక్తి తెరాసలో చేరితే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరువు పోతుందని.. అంతలోపే జానాను ఆ పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా నేతలు అధిష్టానానికి సూచిస్తున్నారు. మరి వీళ్ల అంచనాలు ఇలా ఉంటే.. “కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నేనే ముఖ్యమంత్రిని అవుతా..’ అని ప్రకటించుకున్నాడు కుందూరు జానా రెడ్డి. 

సొంత జిల్లా పర్యటనలో ఉన్న జానా రెడ్డి ఈ ప్రకటన చేశాడు. వచ్చే ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకునా జానా ఈ ప్రకటన చేశాడు. దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్సే అని, తెలంగాణను ఇచ్చిందీ కాంగ్రెస్ పార్టీనే అని జానా రెడ్డి పునరుద్ఘాటించాడు. అయితే ఈ మాటలకు ఓట్లు పడవని ఇప్పటికే చాలా సార్లు తేలిపోయింది. స్వతంత్రం తెచ్చిపెట్టిన డైలాగును అరవై ఏళ్లు కాంగ్రెస్ వాళ్లు వాడుతూనే ఉన్నారు. ఇక తెలంగాణ ఇచ్చామన్న డైలాగును గత ఎన్నికల్లో వాడి ఎలాంటి ఫలితమూ పొందలేకపోయారు. 

ఇలాంటి నేఫథ్యంలో పాత మాటలే చెప్పి కాంగ్రెస్ పార్టీకి పట్టం గట్టాలని జనాలకు విజ్ఞప్తి చేయడమూ కామెడీగానే ఉంది, కాంగ్రెస్ గెలిస్తే తనే ముఖ్యమంత్రి అవుతానని రెడ్డి చెప్పుకోవడం అంతకన్నా కామెడీగా ఉంది. ఒక వేళ టీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ గెలిచి అద్భుతం సాధించినా.. కలహాల కాంగ్రెస్ జానా పదవి మీద ఇప్పటి నుంచి ఆశలు పెట్టుకోవడం  విశేషమే. సీఎల్పీ పదవిని సొంతం చేసుకోవడానికే జానా రెడ్డి చాలా కష్టపడ్డాడు. ముఖ్యమంత్రి పీఠమే అందేటట్టు అయితే అప్పుడేపరిస్థితి ఉంటుందో!

Show comments