అన్నదమ్ముల ‘మెగా’ అనుబంధం.!

మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ కలిశారు. అదీ చిరంజీవి ఇంట్లో. షాకింగ్‌ న్యూస్‌ లాంటిదే ఇది. చిరంజీవి 9 ఏళ్ళ తర్వాత హీరోగా నటించిన చిత్రం కోసం భారీ స్ఠాయిలో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కి పవన్‌కళ్యాణ్‌ హాజరు కాలేకపోవడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. పవన్‌ రాకపోవడంపై చిరంజీవితోపాటు రామ్‌చరణ్‌, నాగబాబు బాగా హర్ట్‌ అయ్యారు. పవన్‌కళ్యాణ్‌ తప్ప మొత్తం మెగా ఫ్యామిలీ ఆ వేడుకలో కన్పించింది. నిజానికి అది సినిమా ఫంక్షన్‌ అనడం కన్నా, మెగా ఫ్యామిలీ తమ అభిమానులతో ఇంటరాక్ట్‌ అయ్యేందుకు ఏర్పాటు చేసిన ఈవెంట్‌.. అనేలా జరిగిందది. 

ట్విట్టర్‌లో విషెస్ చెబుతూ ఓ కామెంట్‌ వేసేసి ఊరుకున్నారు ఆ ఫంక్షన్‌ జరిగిన రోజు పవన్‌కళ్యాణ్‌. అంతే, సినిమా రిలీజ్‌ అయ్యాక కూడా పవన్‌కళ్యాణ్‌ ట్విట్టర్‌ పిట్ట 'ఖైదీ నెంబర్‌ 150'పై ఎలాంటి కామెంట్‌ చేయలేదు. ఇన్ని రోజులకి, ఎలాగైతేనేం పవన్‌కళ్యాణ్‌, చిరంజీవి ఇంటికి వెళ్ళారు. ఇద్దరి మధ్యా సినిమా, రాజకీయాలపై చర్చ జరిగిందనే గుసగుసలు అయితే విన్పిస్తున్నాయి. అదెంత నిజం.? అన్నది వేరే విషయం. 

త్వరలో 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాకి సంబంధించి థ్యాంక్స్‌ మీట్‌ పేరుతో మరో భారీ ఈవెంట్‌ని నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఇటీవలే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ప్రకటించిన విషయం విదితమే. మరి, ఆ వేదికపైన అయినా పవన్‌ కన్నిస్తాడా.? ఆ దిశగా పవన్‌ని మెగా ఫ్యామిలీ నిన్నటి 'డిన్నర్‌ మీటింగ్‌'లో ఒప్పించిందా.? ఏమో మరి, వేచి చూడాల్సిందే. 

ఏదిఏమైనా, 'సినిమా ఫంక్షన్లకు రాలేకపోయినా, మేం తరచూ కలుస్తూనే వుంటాం. చరణ్‌, పవన్‌కళ్యాణ్‌తో ఎప్పటికప్పుడు కలుస్తూనే వుంటాడు. పవన్‌ కూడా ఇంటికి వస్తుంటాడు. పబ్లిక్‌లోకి రావాలంటే పెద్దగా ఇష్టపడడు. చిన్నప్పటినుంచీ అంతే..' అంటూ 'ఖైదీ' ప్రమోషన్స్‌లో చిరు చెప్పిన మాటల్ని కొంతమేర నిజం చేస్తూ, ఇదిగో ఇలా అన్నయ్యను ఇంట్లో తమ్ముడు పవన్ కలిశాడనుకోవాలంతే.

Show comments