నయనతార సినిమాలు.. సెకెండ్ హీరోయిన్ కే పని!

మొత్తానికి బ్యానర్ ఏదైనా, తను ఎంత భారీ పారితోషకాన్ని తీసుకున్నా.. సదరు సినిమా ప్రచారం పనులకు మాత్రమే వచ్చేది లేదన్నట్టుగా సాగుతోంది నయనతార. ఇది వరకూ అనేక సినిమాల విషయంలో నయనతార ప్రచార పర్వాన్ని పట్టించుకోలేదు. తన పని నటించడం వరకూ అన్నట్టుగా వ్యవహరించింది. ఈ విషయంలో నిర్మాతల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చినా.. నయన ను గట్టిగా అడిగిన వాళ్లు మాత్రం లేరు. ఆమె తన తీరును కొనసాగిస్తోంది.

తాజాగా పీవీపీ వాళ్ల సినిమా ‘కాష్మోరా’ ప్రచారంలో కూడా నయన జాడ కనిపించడం లేదు. ఈ సినిమా తమిళ వెర్షన్ ప్రచారంలో కానీ, తెలుగు వెర్షన్ ప్రచారంలో కానీ నయనతార కనిపించలేదు. హైదరాబాద్ లో వేరే సినిమా షూటింగ్ లో ఉన్న సమయంలో కార్తీ దీని ఆడియో విడుదల చేసుకున్నాడు. కాష్మోరాలో మరో హీరోయిన్ గా నటించిన శ్రీ దివ్య ఈ హీరోతో పాటు కనిపించింది. 

కాష్మోరా విశేషాలను మీడియాకు చెప్పే బాధ్యతను ఈ తెలుగమ్మయే స్వీకరించింది. అసలు హీరోయిన్ నయనతార అడ్రస్ లేకపోవడంతో ఈ సెకెండ్ హీరోయిన్ పై బాధ్యతలు పడ్డట్టున్నాయి. ఇక ఈ సినిమా నిర్మాత పీవీపీ స్వయంగా రంగంలోకి దిగి.. సినిమా విశేషాలు చెబుతూ ‘కాష్మోరా’ను మీడియాలో ఉంచే ప్రయత్నం చేస్తున్నాడు. హీరో తమిళుడు కావడంతో.. ఇక్కడ ప్రచారానికి, విజయ యాత్రలకు ఎక్కువ సమయం కేటాయించే ఛాన్స్ లేదు. 

మొన్న బాబు బంగారం, ఇప్పుడు కాష్మోరా.. నయనతార మాత్రం ఈ సినిమాలు విడుదలయ్యాకా వీటితో తనకు సంబంధం లేనట్టుగానే వ్యవహరిస్తోంది. అయినా కూడా పారితోషకం విషయంలోనూ, అవకాశాల విషయంలోనూ నయన స్థాయి తగ్గడం లేదు. అదీ ఆమెకున్న డిమాండ్! 

Show comments