'ఎలక్షన్స్ ఆర్ సెలబ్రేషన్స్ ఆఫ్ డెమోక్రసీ. దే కమ్యూనికేట్ ద విల్ ఆఫ్ ది పీపుల్, విచ్ ఈజ్ సుప్రీమ్ ఇన్ డెమోక్రసీ'
- ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ రోజు జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా ద్వారా చేసిన ట్వీట్.
ఎన్నికలంటే, ప్రజాస్వామ్య పండుగా.? అవి, ప్రజల ఆలోచనల్ని ప్రతిబింబిస్తాయా.? ఆ ఆలోచనలే ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమా.? ఏంటీ, ఇవన్నీ భారతదేశంలో సాధ్యమా.? అసలు, ఇంతకీ ఈ వ్యాఖ్యలు స్వయంగా నరేంద్రమోడీ నుంచి వచ్చాయా.? లేదంటే, ఆయన పేరుతో ఇంకెవరైనా వాటిని పోస్ట్ చేశారా.? అసలాయనకు తన ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యల అర్థమేంటో తెలుసా.? డెమోక్రసీ మీద మోడీకి అంత గౌరవం వుందా.? ఎన్నికల ప్రకియను ఆయన అంతగా గౌరవిస్తరా.?
ఇలా సవాలక్ష ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. అది 2014 ఎన్నికల సందర్భం. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చి తీరతాం.. అని ఇదే నరేంద్రమోడీ ఎన్నికల హామీ ఇచ్చారు. ఆ హామీని నమ్మే కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఆంధ్రప్రదేశ్లో బీజేపీ - టీడీపీలకు అధికారం కట్టబెట్టింది.? మరి, ప్రజల న్యాయబద్ధమైన డిమాండ్కి, వారి హక్కుకి ప్రధాన మంత్రిగా నరేంద్రమోడీ ఇప్పుడు ఏం గౌరవమిచ్చారట.!
ఆంధ్రప్రదేశ్ యువత ప్రశ్నిస్తోంది. ఎక్కడో కాదు, నరేంద్రమోడీ ట్విట్టర్ అకౌంట్లోనే. ఆయన ట్వీట్పై స్పందిస్తున్న ఆంధ్రప్రదేశ్ యువత, 'మీరు మాకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కి.. యువత తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని చెబుతున్నారే, అసలు మేమెందుకు ఓటు హక్కు వినియోగించుకోవాలి.?' అని ప్రశ్నిస్తుండడం గమనార్హం.
అఫ్కోర్స్.. ఆయనేదో చెప్పారు, దానికి వచ్చే స్పందనని ఆయన పట్టించుకుంటారా.? మీరు ఓటెయ్యండి.. మేం, మిమ్మల్ని మోసం చేస్తాం.. ఇదే రాజకీయ నాయకుల నినాదం. ప్రధాని నరేంద్రమోడీ ఇందుకు మినహాయింపేమీ కాదు.