తమిళ హీరో ధనుష్కి ఎవరూ ఊమించని విధంగా సినిమా కష్టాలు ఎదురయ్యాయి. సినిమా కష్టాలంటే, సినిమాటిక్ కష్టాలే మరి. చాలాకాలంగా, ధనుష్ ఓ కేసులోంచి బయటకు రాలేక గింజుకుంటున్న విషయం విదితమే. ఆ కేసు చాలా చిత్రమైనది. అలాగని వింత కేసు ఏమీ కాదు. సింపుల్గా బయటపడాల్సిన ఈ కేసులో, ధనుష్ ఇరుక్కుపోయేలా కన్పిస్తున్నాడు. 'ధనుష్ మా బిడ్డే..' అంటూ ఓ వృద్ధ జంట న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం విదితమే.
నిజానికి ధనుష్, తమిళ దర్శకుడు కస్తూరి రాజా తనయుడు. ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్కి అల్లుడు కూడా. ధనుష్, సెల్వరాఘవన్ - కస్తూరి రాజా సంతానం అని మాత్రమే అందరికీ తెలుసు. అయితే, ధనుష్ తమ బిడ్డ అంటూ తమిళనాడులోని మేలూరుకి చెందిన కదిరీశన్, మీనాక్షి దంపతులు కోర్టును ఆశ్రయించేసరికి అంతా ముక్కున వేలేసుకున్నారు. గత కొంతకాలంగా ఈ కేసు విచారణ కీలకమైన మలుపులు తిరుగుతోంది.
'ధనుష్ నా బిడ్డే..' అని కస్తూరిరాజా ఎంతగా వాదిస్తున్నా ఉపయోగం వుండడంలేదు. న్యాయస్థానం, పలు కోణాల్లో ఈ కేసు విచారణ వేగవంతం చేయడం గమనార్హమిక్కడ. మామూలుగా అయితే ఇలాంటి కేసుల్లో, సింపుల్గా 'కొట్టివేత' జరుగుతుంటుంది. కానీ, ధనుష్ విషయంలో అలా జరగడంలేదు. వ్యవహారం పుట్టుమచ్చలదాకా వెళ్ళింది. భవిష్యత్తులో డీఎన్ఏ టెస్టుల వరకూ వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
గతంలో, ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ తన తండ్రేనంటూ రోహిత్ శేఖర్ అనే వ్యక్తి కోర్టుకెక్కాడు. మొదట్లో అతనెవరో తనకు తెలియదన్న తివారీ, చివరికి అతను తన కొడుకేనని అంగీకరించాల్సి వచ్చింది. ఇంతకీ, ధనుష్ విషయంలో ఏం జరుగుతుంది.? ధనుష్ కస్తూరీరాజా తనయుడేనా.? ఏమోగానీ, సినీ రంగంలో ఇంకెవరికీ ఇలాంటి కష్టం రాలేదన్నది నిర్వవాదాంశం.