దస్ పల్లాలో అనంతపురం మీట్?

అనంతపురం తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే బాలయ్య బాబు పీఏ పుట్టించిన ముసలం ఇంకా సమసిపోలేదు. బాలకృష్ణ పీఏ శేఖర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబే తొలగించారని వార్తలు వినవచ్చినా, అనధికారికంగా అతను కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అనంతపురం సమీపంలోని ఓ ప్రాంతంలోని గెస్ట్ హౌస్ కేంద్రంగా శేఖర్ తన కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా వుంటే అనంతపురం తదితర ప్రాంతాల్లో తన పీఏ కారణంగా పార్టీలో ఏర్పడిన సంక్షోభాన్ని నివారించేందుకు నందమూరి బాలకృష్ణ నడుం బిగించారు. ఈరోజు (మంగళవారం) ఆయన హైదరాబాద్ హోటల్ దస్ పల్లాలో ఓ మీట్ ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఎవరెవరైతే అనంతపురం ప్రాంతంలో అసంతృప్తి వ్యక్తం చేసారో, బాహాటంగా నిరసనలకు దిగారో వాళ్లందరినీ ఈ మీట్ కు పిలిపించినట్లు తెలుస్తోంది.

సమావేశంలో ఓపెన్ గా మాట్లాడమని బాలయ్య కోరగా, అందరూ శేఖర్ పై తీవ్రంగా అనేక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. శేఖర్ వ్యవహారాలను పూసగుచ్చినట్లు వారు వివరించారట. శేఖర్ అవినీతికి పాల్పడడమే కాకుండా, దానిని బాలయ్య ఫ్యామిలీకి పులిమే ప్రయత్నం చేసాడని, దీనిని గమనించాలని వారు చెప్పినట్లు తెలుస్తోంది. 

చిత్రమేమిటంటే సదరు పీఏ బాలయ్యకు కావాల్సిన వ్యక్తియేమీ కాకపోవడం. అతన్ని బాలయ్య దగ్గరకు పనికి పంపించింది లోకేష్ బాబే అని తెలుస్తోంది. అమాయకంగా కనిపించిన అతన్ని లోకేష్ నమ్మి ఇక్కడకు పంపిస్తే, ఇంత చేసాడని సమావేశానికి వచ్చిన తెలుగుదేశం జనాలు చెప్పుకోవడం విశేషం. అయితే ఇంతకీ సమావేశంలో బాలయ్య ఏం తేల్చారన్నది ఇంకా బయటకు రాలేదు. 

Show comments