బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలుగు రాష్ట్రాల పర్యటన కోసం వచ్చారు. తెలంగాణలో పర్యటన ముగిసింది. ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అడుగుపెట్టారాయన. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్తో అమిత్ షా పంచాయితీ పెట్టుకున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై అమిత్ షా విమర్శలు చేయడంతో, సాక్షాత్తూ ముఖ్యమంత్రి మీడియా ముందుకొచ్చి ఆయన మీద విరుచుకుపడ్డారు.
ఇప్పుడిక ఆంధ్రప్రదేశ్ వంతు. అమిత్ షా ఎటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై విమర్శలు చేయరు, పైగా అభినందనల్లో ముంచెత్తుతారు. కారణం, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ - బీజేపీ మిత్రపక్షాలు గనుక. మరి, ప్రతిపక్షం వైఎస్సార్సీపీ ఏం చెయ్యాలి.? ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రాలేదు, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినా దానికి దిక్కులేదు. రైల్వే జోన్ ఊసే లేదు. పోలవరం ప్రాజెక్టు విషయంలో వైఎస్సార్సీపీకి చాలా అనుమానాలున్నాయి. మరి, అమిత్ షా రాకను వైఎస్సార్సీపీ వ్యతిరేకించాలి కదా.!
అయితే, వైఎస్సార్సీపీ - అమిత్ షా ఆంధ్రప్రదేశ్ టూర్పై పూర్తిగా మౌనం దాల్చింది. కొద్దోగొప్పో కాంగ్రెస్ పార్టీ హడావిడి చేస్తోంది. సందట్లో సడేమియా, జనసేన పార్టీ కూడా అమిత్ షాకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తోందండోయ్. చిత్రమైన సందర్భమే ఇది. అమిత్ షా టూర్కి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తే, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వచ్చేస్తుందా.? రాదు. కానీ, ఆంధ్రప్రదేశ్ తరఫున అమిత్ షాకి ప్రత్యేక హోదా సెగ తగిలించాలి కదా.! ఆ బాధ్యత పూర్తిగా ప్రతిపక్షం మీదనే వుంది.
మరెందుకు వైఎస్సార్సీపీ సైలెంట్ అయిపోయింది.? పైగా, సాక్షి మీడియాలో కూడా అమిత్ షా టూర్కి వ్యతిరేకంగా కథనాలేమీ లేవు. వైఎస్సార్సీపీ నేత నారాయణరెడ్డి హత్య ఘటనపైనే కథనాలు పుంఖాను పుంఖాలుగా దర్శనమిచ్చాయి. దానికి తోడుగా, బీజేపీ - టీడీపీ మధ్య పెరుగుతున్న అంతరం, అమిత్ షాకి బీజేపీ నేతలు టీడీపీపై ఫిర్యాదు చేసిన వైనం మీద ఫోకస్ ఎక్కువగా కన్పిస్తోంది.
అడగకుండానే, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకి మద్దతు పలికిని వైఎస్ జగన్, ప్రత్యేక హోదా విషయంలో మాత్రం ప్రశ్నిస్తూనే వుంటానని మొన్నీమధ్యనే ఢిల్లీ టూర్లో సెలవిచ్చారు. ఏదీ, ఎక్కడ.? బీజేపీని ప్రత్యేక హోదాపై నిలదీయడానికి ఇంతకన్నా మంచి సందర్భం వైఎస్ జగన్కి ఇంకోటి దొరక్కపోవచ్చు. విజయవాడలో ఆందోళన చేయడం ద్వారానో, పార్టీ శ్రేణుల్ని ఉద్యమం వైపు ఉత్తేజితుల్ని చేయడం ద్వారానో అమిత్ షాకి సెగ తగిలేలా చేయాల్సిన వైఎస్ జగన్.. పూర్తిగా సైలెంటయిపోవడం ఆశ్చర్యకరం.