వరల్డ్‌ కప్‌.. ఒకే ఒక్క అడుగు దూరంలో.!

కబడ్డీ వరల్డ్‌ కప్‌ 2016 టైటిల్‌కి ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచింది టీమ్‌ ఇండియా. టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా, తొలి మ్యాచ్‌లోనే కొరియా చేతిలో అనూహ్య పరాజయాన్ని చవిచూసిన విషయం విదితమే. అప్పటినుంచీ ఏ మ్యాచ్‌నీ లైట్‌ తీసుకోలేదు. లీగ్‌లో నాలుగు వరుస విజయాలతో సెమీస్‌లోకి అడుగు పెట్టిన టీమిండియా, సెమీస్‌లో థాయ్‌లాండ్‌ జట్టుని చిత్తు చేసింది. 

టీమిండియాతో పోల్చితే థాయ్‌లాండ్‌ జట్టు పసికూనగానే భావించాలి. అయినాసరే ఛాన్స్‌ తీసుకోలేదు. ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ కారణంగా కొరియాకి మ్యాచ్‌ని అర్పించేసుకున్న టీమిండియా, పాఠాలు బాగానే నేర్చుకుంది. పూర్తిస్థాయి బలాన్ని థాయిలాండ్‌ జట్టుపైనా ప్రదర్శించింది. దాంతో, థాయిలాండ్‌ ఏ దశలోనూ టీమిండియాకి పోటీ ఇవ్వలేకపోయింది. 

ఇంకోపక్క, మరో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఇరాన్‌, కొరియాపై విజయం సాధించి ఫైనల్‌లో అడుగు పెట్టింది. రేపు జరిగే మ్యాచ్‌లో ఇరాన్‌ని ఓడిస్తే టీమిండియా కబడ్డీ వరల్డ్‌ కప్‌ 2016 టైటిల్‌ని అందుకుంటుంది. టైటిల్‌ పేవరెట్‌ టీమిండియానే అయినప్పటికీ, ఇరాన్‌ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అదే సమయంలో, టీమిండియా ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా వుంటే ఇరాన్‌ని చిత్తు చేయడమూ పెద్ద విషయం కాదు. 

టీమ్‌ ఇండియా కబడ్డీ జట్టు కెప్టెన్‌ అనూప్‌ కుమార్‌, ఈ వరల్డ్‌ కప్‌ తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌ల నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకుంటున్నట్లు ఇప్పటికే ప్రకటించేశాడు. దాంతో, టీమిండియా కబడ్డీ జట్టు, ఆ విజయాన్ని అనూప్‌కి కానుకగా ఇవ్వాలని చూస్తోంది. ప్రస్తుతానికి ఇండియాలో క్రికెట్‌ తర్వాత కబడ్డీకి ఆ స్థాయిలో 'వ్యూయర్‌ షిప్‌' లభిస్తోంది లైవ్‌ టెలికాస్ట్‌ పరంగా. ఈ వరల్డ్‌ కప్‌ పోటీలతో కబడ్డీ తన పాపులారిటీని పదింతలు చేసుకుందన్నది నిర్వివాదాంశం.

Show comments