సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్కళ్యాణ్, పరీక్ష పెడుతున్నాడు. అదీ జనసేన సైనికుల కోసం. మూడు విడతలుగా ఈ పరీక్ష జరుగుతుంది. పరీక్ష జరిగే జిల్లా అనంతపురం. అక్కడినుంచే జనసేన సైనికుల ఎంపిక ప్రక్రియను ప్రారంభిస్తున్న విషయం విదితమే. ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడింది. 3,600 మంది అభ్యర్థుల నుంచి దరఖాస్తులొచ్చాయి. పరీక్ష నిర్వహించడమే తరువాయి. ఈ నెల 21 నుంచి పరీక్షలు జరుగుతాయి. పరీక్షా ఫలితాల అనంతరం జనసేన సైనికుల ఎంపికపై క్లారిటీ ఇస్తారు.
ఆగండాగండీ, ఇదేమన్నా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అనుకున్నారా.? అనుకున్నా, అనుకోకపోయినాసరే.. జనసేన పార్టీ విధానం ఇదే. పరీక్ష పెడుతున్నారు, ఆ పరీక్షలో విజయం సాధించినవారు మాత్రమే జనసేన సైనికులవుతారు. మీడియాతో మాట్లాడగలిగేవారు, పార్టీ సిద్ధాంతాల్ని ప్రచారం చేయగలిగేవారు, ప్రజల సమస్యల్ని గుర్తించి వాటి పరిష్కారానికి కార్యాచరణ తయారుచేయగలిగేవారు.. ఇలా వివిధ కేటగరిల్లో 'ఉద్యోగాలకు' జనసేన పార్టీ నోటిఫికేషన్ వెల్లడించింది.
రాజకీయాల్లో ఇది సరికొత్త ట్రెండ్ అనుకోవాలేమో.! జనసేనకు చెట్టపేరు తీసుకురావాలనుకునేవారున్నారనీ, అలాంటివారిని ఈ పవిత్ర యజ్ఞంలోకి చొరబడకుండా జనసేన సైనికులు అత్యంత జాగ్రత్తగా వుండాలంటూ పవన్కళ్యాణ్, 'పరీక్షల' నేపథ్యంలో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. అదిరిందయ్యా పవన్కళ్యాణూ.!
అంతా బాగానే వుందిగానీ, పార్టీ అధినేతగా పవన్కళ్యాణ్ ఈ పరీక్షకు హాజరైతే, ఆయనకు ఎన్ని మార్కులు వస్తాయట.? అసలే, స్టడీస్లో కాస్త వెనకబడ్డ వ్యక్తి కదా.. అందుకే, ఆయనకి పరీక్షలంటే భయం.. ఆయన పరీక్షలు పెడ్తారంటే. రాజకీయాల్లో రాసేవాడు వెర్రి వెంగళప్ప అయితే.. ఎవరైనా పరీక్షలు పెట్టేయొచ్చన్నమాట.!