తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, 'అభిమానులతో ఫొటో దిగడం అసాధ్యం' అని తేల్చేశారు. ఒక్కో అభిమానితో ఫొటో దిగాల్సి రావడం రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్కే కాదు, చిన్నా చితకా హీరోలకీ అసాధ్యమే. కానీ, రజనీకాంత్ అభిమానులందర్నీ చెన్నయ్కి వచ్చేయాల్సిందిగా మొన్నీమధ్యనే పిలుపునిచ్చి, ఆ తర్వాత తూచ్ అనేసి పెద్ద తప్పు చేసేశారు మరి.!
నిజానికి, రజనీకాంత్ తన అభిమానుల్ని రమ్మన్నది రాజకీయాల గురించి మాట్లాడేందుకు. అభిమాన సంఘాల అధ్యక్ష, కార్యదర్శుల్ని చెన్నయ్కి రావాల్సిందిగా 'మెసేజ్' పంపారు రజనీకాంత్. తమ అభిమాన హీరో అలా పిలిచేసరికి, అభిమానులు ఉరుకులు పరుగులమీద చెన్నయ్కి చేరుకున్నారు. ఏప్రిల్ 2 రానే వచ్చింది. కానీ, అంతకన్నా ముందే రజనీకాంత్, అభిమానుల ఆశల మీద నీళ్ళు చల్లేశారు. 'అది రాజకీయ చర్చ కోసం కాదు, అభిమానులతో మామూలుగా కలిసేందుకే..' అని చావు కబురు చల్లగా చెప్పారు రజనీకాంత్. పోనీ, సరదాగానే అయినా రజనీకాంత్ కలిశారా.? అంటే అదీ లేదు.
ఏ ఫంక్షన్ హాల్లో అయితే అభిమానుల్ని కలుస్తానని రజనీకాంత్ చెప్పారో, అక్కడ సమావేశం రద్దు కావడంతో అభిమానులు ఆగ్రహావేశాలతో ఊగిపోయి, దాడులకు తెగబడ్డారు. ఆ తర్వాత తీరిగ్గా రజనీకాంత్, 'మరో డేట్ని' అనౌన్స్ చేశారు. ఈ నెల 12 నుంచి 17 వరకు అభిమానులతో ఫొటోలు దిగుతానని చెప్పారు. ఇప్పుడు అదీ రద్దయ్యింది. జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించడం మేలనే అభిప్రాయానికి వచ్చి, అదే విషయాన్ని అభిమానులకు తెలిపారు రజనీకాంత్.
ఇంతకీ, రజనీకాంత్కి ఏమయ్యింది.? ఈ గందరగోళం ఎందుకు.? ఇదే ఇప్పుడు అభిమానుల ఆవేదన. పిలవడం, మాట మార్చడం, ఇంకో కొత్త కథ చెప్పడం.. రజనీకాంత్లో ఎప్పుడూ చూడని కొత్త కోణమిది.