నాగ్ వందో సినిమాలో అఖిల్, చైతూ

బాలయ్య వందో సినిమా అయిపోయింది..మెగాస్టార్ 150వ సినిమా అయిపోయింది. ఇప్పుడు నాగ్ వందో సినిమా వ్యవహారం వార్తల్లోకి రానుంది. అయితే మరీ ఇప్పటికిప్పుడు కాదు. కొన్ని నెలల తరువాత. వాస్తవానికి నాగ్ సినిమాలు వందకు చేరువ కాలేదు. కానీ కామియో రోల్స్ వగైరా కలుపుకుంటే వందకు దగ్గరవుతాయి. నాగ్ కు ఈ విషయంలో అంత ఆసక్తి లేకున్నా, అభిమానులు మాత్రం వందో సినిమా ఓ మైల్ స్టోన్ మాదిరిగా వుండాల్సిందే నని అంటున్నారట నాగ్ తో. దాంతో వందో సినిమాగా ఏది చేస్తే బాగుంటుంది అన్న దానిపై ఓ క్లారిటీకి వచ్చేసాడట. 

సినిమా కథ అయితే రెడీగా లేదు కానీ, క్యారెక్టర్ మాత్రం బంగార్రాజు అని నాగ్ ఫిక్సయిపోయాడట. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో బంగార్రాజు క్యారెక్టర్ ఎంత హిట్ అన్నది తెలిసిందే. అందుకనే ఈ బంగార్రాజు క్యారెక్టర్ ను సెంట్రల్ పాయింట్ గా తీసుకుని, మాంచి కథ రెడీ చేయమని ఒకరిద్దరు డైరక్టర్లకు సూచించాడట. అయితే ఇక్కడ ఇంకో గమ్మత్తు ఏమిటంటే అలా స్క్రిప్ట్ చేయమన్న డైరక్టర్లకు ఓ కండిషన్ పెట్టాడట.  అఖిల్, చైతూ ఇద్దరికీ కూడా మాంచి పాత్రలు వుండాలి ఆ స్క్రిప్ట్ లో.  అదీ కండిషన్. వీలయితే అమల కు కూడా మంచి క్యారెక్టర్ వున్నా మరీ మంచిదని చెప్పాడట.

అంటే మళ్లీ మనం మాదిరిగా ఓ మాంచి మైల్ స్టోన్ సినిమాను తన వందో సినిమాగా చేయాలని నాగ్ డిసైడ్ అయిపోయాడన్నమాట. అయితే ఈ లోగా రాజుగారి గది 2, చందుమొండేటి సినిమాలు పూర్తి కావాలి. మరోపక్క దిల్ రాజు ఓ స్క్రిప్ట్ పట్టుకుని నాగ్ ను ఒప్పించాలని తెగ ప్రయత్నిస్తున్నాడు. 

Show comments