డీజే ఎఫెక్ట్: చిరంజీవిని చల్లార్చే ప్రయత్నం

మినిమం గ్యాప్ లో ఈమధ్య కాలంలో చాలా ఫంక్షన్లు చేశాడు నిర్మాత దిల్ రాజు. గతంలో కూడా పలు వేదికలపై మాట్లాడాడు. కానీ చిరంజీవిని మాత్రం ఇంతలా పొగడలేదు. చిరంజీవి గురించి మాట్లాడ్డానికి ఇంత టైం తీసుకోలేదు. ఈసారి మాత్రం దిల్ రాజు టైం తీసుకున్నాడు. పనిగట్టుకొని మరీ చిరంజీవిని పొగిడే ప్రయత్నం చేశాడు. గత అనుభవాల్ని గుర్తుచేసుకున్నాడు. తీపి జ్ఞాపకాల్ని పంచుకున్నాడు. ఇంత సడెన్ గా ఇవన్నీ చేయాల్సి రావడానికి కారణం డీజే సినిమా. 

డీజే సినిమా వసూళ్లు చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక 150వ సినిమా ఖైదీ నంబర్ 150ని కూడా మించిపోయాయంటూ ప్రకటించేశారు. దీనిపై మెగా ఫ్యాన్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఏకంగా ఓ వంద మంది ఫ్యాన్స్, దిల్ రాజు ఆఫీస్ ముందు ధర్నా కూడా చేశారు. ఆ మేటర్ ను దృష్టిలో పెట్టుకొని చిరంజీవిని ఆకాశానికెత్తేశాడు దిల్ రాజు. అంతేకాదు.. కలెక్షన్లపై ఓ చిన్నపాటి క్లారిటీ కూడా ఇచ్చాడు

"చిరంజీవిని తలుచుకోకుండా ఏ ఫంక్షన్ జరగదు. ఖైదీ నంబర్ 150, డీజేకు కావాలని కొందరు పోలిక పెడుతున్నారు. కలెక్షన్ల విషయంలో ఈ రెండు సినిమాలకు అస్సలు సంబంధం లేదు. చిరంజీవి రేంజ్ ఏమాత్రం తగ్గదు. ఖైదీ నంబర్ 150 వెరీ స్పెషల్ ఫిలిం. దానికి డీజేకు కంపేరిజన్ తేవడంలేదు. చిరంజీవి గారు థాంక్ యు. ఇలాంటివి మీరు పట్టించుకోరు". తాజా వివాదంపై దిల్ రాజు మాట్లాడిన మాటలివి.

తన ప్రసంగంతో దిల్ రాజు ఏం చెప్పదలచుకున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మాట్లాడింది. డీజే వసూళ్లు చెప్పినంత రేంజ్ లో రాలేదని పరోక్షంగా ఒప్పుకున్నారా..  లేక ఖైదీ నంబర్ 150 కంటే తక్కువగానే డీజేకు వసూళ్లు వచ్చాయని చెబుతున్నారా.. ఏదేమైనా తాజా ప్రకటనతో దిల్ రాజు సగం నిజం ఒప్పుకున్నట్టయింది.

Show comments