మహేశ్ తో కాదు.. ఆ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా?

ఆ మధ్య తమిళ దర్శకుడు సుందర్.సి ఒక భారీ సినిమా అంటూ వార్తల్లోకి వచ్చాడు. ఆ సినిమా రూపకల్పనకు రెండు వందల కోట్ల వరకూ ఖర్చు చేస్తామని అన్నాడు. దక్షిణాదినే కాదు, దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా నిలుస్తుందని ఆయన ప్రకటించాడు. మరి చిన్న చిన్న సినిమాలు చేసుకునే సుందర్.సి అంత భారీ బడ్జెట్ పిక్చర్ ను నిజంగానే హ్యాండిల్ చేయగలడా? అనేది ఒక అనుమానంగా నిలుస్తూ వచ్చింది.

ఆ సినిమాను దక్షిణాది స్టార్ హీరోలు మహేశ్ బాబు, సూర్యలతో రూపొందిస్తామని ఆ దర్శకుడు ప్రకటించాడు. అయితే ఆ హీరోల నుంచి ఆ సినిమా గురించి అధికారిక ధ్రువీకరణ లేదు. ఆ తర్వాత అందులో మహేశ్- సూర్యలు కాదు, విజయ్ – సూర్యలు హీరోలుగా నటిస్తారని మరో ప్రకటన చేశారు. ఆ విషయాన్ని వారు కూడా ధ్రువీకరించలేదు.

కానీ ఇప్పుడు సుందర్.సి క్రేజీ ప్రాజెక్టులో కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. జయం రవి- ఆర్యల కాంబినేషన్ లో ఆ సినిమాను తెరకెక్కిస్తారట. ఆ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తారట. ముందుగా చెప్పినట్టే.. దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా నిలుస్తుందట అది!

మరి ఇప్పటి వరకూ హీరోలు వరసగా మారిపోయారు.. ఇప్పుడు కూడా హీరోల నుంచి అధికారిక ధ్రువీకరణ లేదు! లీకుల హడావుడి మాత్రమే! ఈ సినిమాకు ఇప్పుడు ఒక పేరు మాత్రం పెట్టారండోయ్.. ‘సంఘమిత్ర’ అని!

Show comments