విద్యాబాలన్‌ సైకిలెక్కుతుందట.!

బాలీవుడ్‌ హీరోయిన్‌ విద్యాబాలన్‌కి బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది సమాజ్‌ వాదీ పార్టీ. పార్టీ అంటే పార్టీ కాదండోయ్‌.. ఆ పార్టీ నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వం. అదేనండీ, ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌ వాదీ పార్టీ నేతృత్వంలోని అఖిలేష్‌ యాదవ్‌ ప్రభుత్వం, ప్రజలకు అందిస్తున్న పలు పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు (?!) విద్యాబాలన్‌ని బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించింది. ఈ నియామకం వెనుక పెద్ద కథే వుందట. 

అసలు విషయమేంటంటే, బాలీవుడ్‌లో విద్యాబాలన్‌ పాపులర్‌ నటి. పైగా, 'డర్టీపిక్చర్‌' సినిమాతో ఆమె రేంజ్‌ ఎక్కడికో వెళ్ళిపోయింది. సినిమా వచ్చి చాన్నాళ్ళే అయినా, మాస్‌ ఆడియన్స్‌లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసేసింది విద్యాబాలన్‌ 'డర్టీ పిక్చర్‌' సినిమాతో. అదే, ఆ పాపులారిటీనే రాజకీయంగా తమకు ప్లస్‌ అవుతుందని సైకిల్‌ పార్టీ.. (అదేనండీ సమాజ్‌ వాదీ పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్‌ కదా) విద్యాబాలన్‌ని బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఫిక్స్‌ చేసిందట. అదీ అసలు కథ. 

రాజకీయ కార్యక్రమాలకు తాను దూరంగా వుంటాననీ, ప్రభుత్వం తరఫున బ్రాండ్‌ అంబాసిడర్‌గా వుండమంటే వుంటానని ముందే కండిషన్స్‌ పెట్టిందట విద్యాబాలన్‌. ముఖ్యమంత్రి అఖిలేష్‌ తక్కువోడేమీ కాదు, తమ పార్టీ ఎన్నికల గుర్తు కనిపించేలా, విద్యాబాలన్‌తో వెరైటీగా పబ్లిసిటీ పోస్టర్స్‌, వీడియోస్‌ ప్లాన్‌ చేయించాలనే ప్లాన్‌ వేయడం గమనార్హం. 

ఏమో, రాజకీయాల్లో రాణించాలనే ఆలోచన విద్యాబాలన్‌లో మెదిలితే, ఆమె రాజకీయ ప్రస్థానం రానున్న ఎన్నికల్లో (త్వరలో ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలు జరగనున్నాయి) ప్రారంభమవుతుందేమో.! అన్నట్లు, పార్టీకి ఒకప్పుడు దూరమైన జయప్రదను ఇటీవల సమాజ్‌ వాదీ పార్టీ అక్కున చేర్చుకుంది. క్యాబినెట్‌ ర్యాంక్‌తో ఓ పదవిని కూడా జయప్రదకు ఇటీవలే సమాజ్‌ వాదీ పార్టీ కట్టబెట్టిందండోయ్‌.!

Show comments