డ్రగ్స్‌ రగడ: షాక్‌కి గురైన కాజల్‌ అగర్వాల్‌

డ్రగ్స్‌ కేసులో 'రోనీ' అరెస్ట్‌ అవడం తనను షాక్‌కి గురిచేసిందని హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ పేర్కొంది. సోషల్‌ మీడియా వేదికగా, కాజల్‌ అగర్వాల్‌ - రోనీ అరెస్ట్‌పై స్పందించింది. రోనీ, గతంలో కాజల్‌ అగర్వాల్‌కి మేనేజర్‌గా పనిచేశాడు. కాజల్‌కి మాత్రమే కాదు, టాలీవుడ్‌లో పలువురు హీరోయిన్లకు మేనేజర్‌గా పనిచేసిన రోనీ, ఇటీవల ఎక్సయిజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ జరిపిన దాడుల్లో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయిన విషయం విదితమే. 

ఈ నేపథ్యంలో కాజల్‌ చుట్టూ రకరకాల గాసిప్స్‌ షురూ అయ్యాయి. కాజల్‌ మేనేజర్‌ అరెస్ట్‌.. అంటూ జరుగుతున్న ప్రచారంపై ఆమె స్పందించింది. 'వృత్తిపరమైన స్నేహం తప్ప, ఎవరితోనూ అంతకు మించిన సంబంధాలు నాకు లేవు..' అంటూ క్లారిటీ ఇచ్చింది కాజల్‌ అగర్వాల్‌. 'నా తల్లిదండ్రులు నా కెరీర్‌కి సంబంధించిన విషయాల్ని చూసుకుంటారు..' అని పేర్కొంది కాజల్‌. 

ప్రస్తుతం కాజల్‌ తెలుగులో రానా సరసన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలోనూ, కళ్యాణ్‌రామ్‌ సరసన 'ఎంఎల్‌ఏ' సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం విదితమే.

Show comments