'ఓం నమో వెంకటేశాయ' అంటూ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, నాగార్జునతో తెరకెక్కిస్తున్న సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న విషయం విదితమే. ఈ సినిమా టైటిల్పై ఆల్రడెడీ వివాదం నడుస్తోంది. అన్నమయ్య, శ్రీరామదాసు భక్తులు కాగా, ఆయా సినిమాలకు ఆ పేర్లు పెట్టారు.. హథీరామ్బాబా భక్తుడు కాగా, ఆ భక్తుడి కథతో రూపొందుతున్న సినిమాకి మాత్రం 'ఓం నమో వెంకటేశాయ' అనే టైటిల్ ఎందుకు పెట్టారన్నది కొందరి వాదన. ఇప్పుడీ వివాదం ముదిరి పాకాన పడ్తోంది.
ఈ సంగతిలా వుంటే, దర్శకేంద్రుడు 'ఓం నమో వెంకటేశాయ' సినిమాలో గ్లామర్ డోస్ కాస్త ఎక్కువే వేశాడట. ఆ విషయం, హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ వెల్లడించింది. దర్శకేంద్రుడు తనమీదా పూలూ, పళ్ళూ ప్రయోగించాడంటూ ప్రగ్యా జైస్వాల్ చేసిన వ్యాఖ్యలు అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి. ఒకప్పడు దర్శకేంద్రుడి సినిమా అంటే, హీరోయిన్ నాభీ మీద పూలూ, పళ్ళతో రొమాంటిక్ విన్యాసాలు తప్పనిసరి. ఆయన సినిమాల్లో హీరోయిన్ల గ్లామర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కవే. భక్తిరస చిత్రమే అయినా, 'అన్నమయ్య'లో మోహన్బాబు, రోజా మధ్య ఓ హాట్ సాంగ్ని తెరకెక్కించాడు దర్శకేంద్రుడు. ఆ పాట అప్పట్లో వివాదాలకు కారణమయ్యింది. అయినాసరే, ఆ సినిమా ఘనవిజయం సాధించిందనుకోండి.. అది వేరే విషయం.
ఇక, ఇప్పుడు 'ఓం నమో వెంకటేశాయ' సినిమాలో ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ మీద దర్శకేంద్రుడు ఫోకస్ పెట్టడం కొత్త వివాదాలకు తావిస్తోంది. సినిమాలో ఏముందో, దర్శకుడు ఆమెను ఎంత గ్లామరస్ పాత్రలో చూపించాడో ప్రస్తుతానికైతే సస్పెన్సే. కానీ, ప్రగ్యా జైస్వాల్ వ్యాఖ్యలతో మాత్రం వివాదం షురూ అయిపోయింది. భక్తి సినిమాల్లో రక్తి ఏంటి.? అన్నది కొందరి ఆవేదన. ఓ వైపు టైటిల్ వివాదం, ఇంకో పక్క గ్లామర్ రగడ.. వెరసి, 'ఓం నమో వెంకటేశాయ'కి ఫ్రీ పబ్లిసిటీ అనుకోవాలేమో.