సయేషాకి పెద్ద కష్టమే వచ్చింది

హీరోయిన్‌గా తొలి సినిమానే డిజాస్టర్‌ అంటే అది ఎంత కష్టమో కదా.! అక్కినేని అఖిల్‌ హీరోగా నటించిన 'అఖిల్‌' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది బాలీవుడ్‌ భామ సయేషా సెహగల్‌. తొలి ఛాన్స్‌ 'శివాయ్‌' రూపంలో వచ్చినా, ముందుగా విడుదలైంది మాత్రం 'అఖిల్‌' సినిమానే. అతి త్వరలో 'శివాయ్‌' విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సయేషా, దేశమంతా తిరుగుతోంది సినిమా పబ్లిసిటీ కార్యక్రమాల్లో భాగంగా. 

షరామామూలుగానే తొలి సినిమా 'అఖిల్‌' గురించిన ప్రస్తావన ఆమెకు ఇబ్బందికరంగా మారుతోంది. 'తొలి సినిమా 'అఖిల్‌' ఆశించిన విజయం సాధించని మాట వాస్తవమే, కానీ ఆ సినిమాతో నేను చాలా నేర్చుకున్నాను.. హీరో అఖిల్‌, వినాయక్‌ ఎంతో ప్రొఫెషనల్‌గా వుండేవారు.. ముందు ముందు తెలుగు సినిమాల్లో నటించాలనుకుంటున్నాను..' అంటూ ఎలాగోలా కవర్‌ చేసేస్తోంది సయేషా. అంతేనా, తొలి సినిమా పరాజయం ఇబ్బందికరమే అయినా, సక్సెస్‌నీ ఫెయిల్యూర్‌నీ ఒకేలా తీసుకోకపోతే కెరీర్‌లో ముందడుగు వేయలేమని సయేషా క్లాసులు కూడా తీసుకుంటోంది. 

ఇదిలా వుంటే, 'శివాయ్‌' సినిమాపై భారీ అంచనాలే వున్నాయి. అజయ్‌దేవగన్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించిన విషయం విదితమే. ఇక, 'అఖిల్‌' సినిమా ఫెయిల్యూర్‌ని పక్కన పెట్టి, తొలి సినిమాగా 'శివాయ్‌' సినిమాని ప్రమోట్‌ చేసుకునే పనిలో బిజీగా వున్న సయేషాకి 'శివాయ్‌' ఆశించిన విజయాన్ని అందిస్తుందా.? వేచి చూడాల్సిందే.

Show comments