పైరసీ ఎఫెక్ట్... కాస్త ముందుగానే "సాహో" టీజర్

ఊహించని విధంగా ఇంటర్నెట్ లో లీక్ అయిన "సాహో" టీజర్.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ కు నిజంగానే చుక్కలు చూపించింది. ఓవైపు ఆ టీజర్ ను సోషల్ మీడియాలో అడ్డుకుంటూనే మరోవైపు టీజర్ రిలీజ్ ప్లాన్ ను మార్చేశారు నిర్మాతలు. బాహుబలి-2 సినిమా విడుదల కంటే ముందు టీజర్ ను లాంచ్ చేయాలని నిర్ణయించుకున్నారు.

బాహుబలి-ది కంక్లూజన్ మూవీతో పాటు సాహో టీజర్ ను లాంచ్ చేయాలనుకున్నారు. బాహుబలి-2 ఇంటర్వెల్ టైమ్ లో సాహో టీజర్ ప్రసారం అవుతుందన్నమాట. కానీ టీజర్ లీక్ అవ్వడంతో ఇప్పుడు ప్లాన్ మార్చారు. ఈరోజే టీజర్ ను లాంచ్ చేస్తున్నారు. సరిగ్గా సాయంత్రం 5గంటల 30ని.లకు యూవీ క్రియేషన్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్ లో సాహో టీజర్ చూడొచ్చు.

ఈరోజు రాత్రి నుంచే బాహుబలి-2 ప్రీమియర్స్ ప్రారంభం కాబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని మల్టీప్లెక్సుల్లో బాహుబలి-2ను ఈరోజు రాత్రి నుంచే రిలీజ్ చేస్తున్నారు. సో.. యూట్యూబ్ లో టీజర్ విడుదలైన కొన్ని గంటలకే బిగ్ స్క్రీన్ పై కూడా సందడి చేయనుంది సాహో.

ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రాబోతున్న సాహో సినిమా కోసం దాదాపు 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయించింది యూవీ క్రియేషన్స్. సాహో టైటిల్ ను ఇప్పటికే తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిజిస్టర్ చేయించిన విషయం తెలిసిందే.

Show comments