సీనియర్ హీరోయిన్ .. తిరిగి భర్త చెంతకు..?!

ఆరున్నర సంవత్సరాల కిందట తిరుపతిలో ఘనంగా వివాహం చేసుకున్న హీరోయిన్ రంభ వైవాహిక జీవితం గురించి చాన్నాళ్లుగా రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. 2012లోనే ఆమె విడాకులు తీసుకుంటోందన్నట్టుగా ప్రచారం మొదలైంది. అయితే అవన్నీ పుకార్లే అని రంభ ఖండించింది. రంభ తరపున నటి ఖుష్బూ కూడా ఆ ప్రచారం పై విరుచుకుపడింది.

తన వైవాహిక జీవితం సాఫీగా సాగుతున్నట్టుగా అప్పట్లో రంభ స్పష్టం చేసింది. అయితే ఆ తర్వాత కూడా  ఆమె భర్త నుంచి వేరేపడిందనే రూమర్లు వచ్చాయి. ఈ మధ్య కొత్త సినిమాల్లో కనిపించడం కూడా మానేసిన రంభ గురించి ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త వచ్చింది.

ఆమె చెన్నై ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసిందంటూ తమిళ మీడియా చెబుతోంది. భర్తతో తిరిగి కలవడానికి ఆమె ఈ పిటిషన్ దాఖలు చేసిందని తమిళ మీడియా కథనాల సారాంశం. రంభ భర్త కెనడాలో స్థిరపడిన ఒక భారతీయ వ్యాపార వేత్త అని.. వీళ్లిద్దరికీ ఒక పాప కూడా ఉందని.. అయితే కొంత కాలంగా రంభ భర్తకు దూరంగా ఉంటున్నారని.. ఈ దంపతులు తిరిగి దగ్గరవ్వాలని అనుకుంటున్నారని.. ఇన్నేళ్లూ దూరదూరంగా ఉన్నారు కాబట్టి, న్యాయపరంగా చిక్కులు లేకుండా వీళ్లిద్దరూ చట్టబద్ధంగా తిరిగి దగ్గరవుతున్నారని సమాచారం.

ఇప్పటికే రంభ పిటిషన్ విచారణకు వచ్చిందని డిసెంబర్ మూడున తదుపరి విచారణ ఉంటుందని  తెలుస్తోంది. 

Show comments