చంద్రబాబు సర్కారుపై రైతులు, యువత, సామాన్యుల్లోనే కాదు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల్లోనూ తీవ్ర ఆగ్రహం నివురు గప్పిన నిప్పులా ఉంది. సమయం వచ్చినప్పుడు అది బయటపడుతోంది. వ్యతిరేకించిన వారిని కఠినంగా అణచివేయడమే తప్ప ఆ వ్యతిరేకతకు కారణాలను గుర్తించి పరిష్కరించే పాపాన పోవడం లేదు సీఎం చంద్రబాబు.
ప్రభుత్వ విధానాలపై ఫేస్బుక్ వేదికగా మాజీ సీఎస్, బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ ఐవైఆర్ క్రిష్ణారావు చేసిన ఆరోపణలే ఇందుకు తార్కాణం. చంద్రబాబు వద్ద సీఎస్గా పనిచేసిన వ్యక్తే ఇలా వ్యాఖ్యానిస్తే ఇక సాధారణ ఉద్యోగుల్లో ఎంతటి ఆగ్రహావేశాలు గూడుకట్టుకున్నాయో ఊహించవచ్చు.
వాస్తవానికి ఐవైఆర్ ఫేస్బుక్లో ప్రస్తావించిన, అభ్యంతరం తెలిపిన అంశాలన్నీ గతంలో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు వ్యతిరేకించిన విషయాలే. ప్రజలు, ప్రతిపక్షాలను పట్టించుకోవడం ఎప్పుడో వదిలేసిన బాబు తన ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటూ ముందుకుపోతున్నారు. వాటిని వ్యతిరేకించే అధికారులను బదిలీ చేస్తూ తనకు కావాల్సిన వారిని తెచ్చిపెట్టుకుంటున్నారు.
ఐవైఆర్ సీఎస్గా ఉండగానే అనేక దురుసు నిర్ణయాలను చంద్రబాబు తీసుకున్నారు. ఆ సమయంలో వాటిని ఐవైఆర్ స్వయంగా వ్యతిరేకించారు. సీఎంకు నేరుగా తన అభ్యంతరాలను తెలిపారు. కానీ బాబు సహజ సిద్ధంగానే వాటిని పట్టించుకోలేదు.
ప్రభుత్వంలో సీఎం తరవాత అంతటి స్థానం, అధికారులందరికీ బాస్ స్థాయి అయిన సీఎస్ పోస్టులో ఉన్న ఐవైఆర్ ఆనాడు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడలేకపోయాడు. సర్వీస్ నుంచి రిటైర్ అయిన తరవాత బాబు ప్రజావ్యతిరేక నిర్ణయాలను కడిగిపారేస్తున్నారు. దీన్ని జీర్ణించుకోలేని బాబు ఆయన్ని బ్రాహ్మణ కార్పోరేషన్ పదవి నుంచి తొలగించారు.
బావమరిది బాలక్రిష్ణ నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రానికి ప్రభుత్వం తరఫున పన్నులన్నీ ఎత్తివేశాడు బాబు. సదరు చిత్ర ఆడియో, రిలీజ్ వేడుకలకు హాజరై ప్రభుత్వ కార్యక్రమం అన్న రీతిలో పబ్లిసిటీ చేశాడు. ఆంధ్రులంతా తప్పనిసరిగా శాతకర్ణి చూడాలని పిలుపునిచ్చాడు. బాహుబలి సినిమా అధిక షోలు ప్రదర్శించుకునేందుకు, అధిక ధరకు టికెట్లు అమ్ముకునేందుకు ప్రభుత్వం అనుమతించింది.
సినిమా రిలీజ్ అయిన నెల రోజుల వరకూ బీ, సీ సెంటర్లలో కూడా 200 రూపాయలకు టికెట్లు విక్రయించారు. సీఎం బాబు స్వయానా ప్రతి ఒక్కరూ బాహుబలి సినిమా చూడాలని పిలుపునిచ్చారు. సినమా పట్ల ప్రజల బలహీనతను సొమ్ము చేసుకోవాలనుకున్న చిత్ర నిర్మాతలకు సహకరించాడు. ఒక ముఖ్యమంత్రిగా ఇది కరెక్టేనా?
ఫేస్బుక్లో విమర్శించేవారిని అరెస్ట్ చేయడం సరికాదని ఐవైఆర్ పేర్కొనడంలో బాబు అండ్ బ్యాచ్కు తప్పు ఎలా కనిపించిందో అర్థంకావడం లేదు. టీటీడీ ఈవోగా ఉత్తర భారత దేశ అధికారిని నియమించడం పై అప్పట్లో ప్రతిపక్షాలు, స్వామీజీలు, మిత్రపక్ష పవన్ కళ్యాణ్, స్వపక్షంలోని కొందరు కూడా విమర్శలు చేశారు. ఇప్పుడు ఐవైఆర్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంత మాత్రం దానికే ఆయన్ని పదవి నుంచి తొలగించారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడినా వారిపై కక్ష సాధించడం బాబుకు కొత్తమే కాదుగా అని ఉద్యోగులు సర్దుకుపోతున్నారు. తనను పదవి నుంచి తొలగించడంపై ఐవైఆర్ మీడియాతో మాట్లాడబోతున్నారు. ఈ సందర్భంగా బాబు బండారాలు ఏమీమి బయటపెడతారో చూడాలి.