విశాఖపట్నంలో అధికార పార్టీ నేతల భూ కుంభకోణాలపై ప్రతిపక్ష వైస్సార్సీపీ సేవ్ విశాఖ పేరిట చేపట్టిన ఆందోళనపై ఇంటిలిజెన్స్ వర్గాలు ఆరా తీసినట్టు సమాచారం. జగన్ ధర్నాపై విశాఖ వాసుల స్పందన తెలుసుకుని ఖచ్చితమైన నివేదిక అందించాలని సీఎం చంద్రబాబు ఇంటిలిజెన్స్ అధికారులను ఆదేశించారు. దీంతో నిఘా విభాగం ప్రతిపక్షనేత ఆందోళనపై చాలా లోతుగా ఆరాతీసినట్టు తెలుస్తోంది.
మహాధర్నాకు హాజరైన ప్రజల వద్ద మఫ్టీలోని ఇంటిలిజెన్స్ పోలీసులు కూపీ లాగారు. ఇందులో వెల్లడైన నిజాలు ప్రభుత్వంలో ఆందోళన కలిగిస్తున్నాయి. సేవ్ విశాఖ మహాధర్నాకు విశాఖ వాసులు స్వచ్ఛందగా తరలి వచ్చారని, భూ కుంభకోణాల్లో ప్రభుత్వ హస్తం ఉందని వారంతా బలంగా నమ్ముతున్నారని ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం బాబు కోటరీలో గుబులు పుట్టిస్తున్నట్టు సమాచారం.
వాస్తవానికి సేవ్ విశాఖ మహాధర్నాను జగన్ అనౌన్స్ చేసినప్పటి నుంచి విశాఖ పట్నంలో హైప్ ప్రారంభమైంది. భూ కుంభకోణ బాధితులు వేలాది మంది ఉండడంతో వారంతా జగన్ ధర్నాపై ఆశలు పెట్టుకున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వ పెద్దలు, అధికారుల భూ దాహానికి బలైన ప్రతి ఒక్కరూ జగన్ ధర్నాలో పాల్గొని తమ బాధను వెలిబుచ్చేందుకు ఆసక్తి చూపించారు.
దీంతో జగన్, వైసీపీ నేతలు కూడా ఊహించని రీతిలో సేవ్ విశాఖ ధర్నాకు వేలాది మంది హాజరయ్యారు. జగన్ మహాధర్నా కారణంగా ఉక్కు నగరంలో ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీకి జరగబోయే నష్టాన్ని ఇంటిలిజెన్స్ ద్వారా ముందుగానే తెలుసుకున్న చంద్రబాబు విశాఖలో జగన్ మహాధర్నాకు అనుమతి నిరాకరించాడు.
ప్రభుత్వం అనుమతి ఇవ్వకున్నా ధర్నా నిర్వహించి తీరుతాం అని ప్రతిపక్ష నేత ప్రకటించడం, విశాఖవాసులు కూడా ధర్నా పట్ల సానుకూలంగా ఉన్నారన్న సమాచారం నేపథ్యంలో బాబు కాస్త వెనక్కి తగ్గాడు. విశాఖపట్నం ప్రతిష్ట ఏమైపోవాలి.. అనే డైలాగులను ప్రయోగించలేదు. ధర్నా ద్వారా జగన్కు పెరిగే మైలేజీని వీలైనంత తగ్గించేందుకు ప్లాన్లు వేశాడు.
జగన్ ధర్నా రోజునే టీడీపీ నేతల చేత సంకల్ప దీక్షల పేరిట బలవంతపు వేడుకలు నిర్వహించేందుకు ఒత్తిడి తెచ్చాడు. దీంతో విశాఖలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయిన అందరూ ఊహించారు. అయితే జగన్ ధర్నా ముందు సర్కారు మొక్కుబడి దీక్షలు వెలవెలబోతాయని గ్రహించి జిల్లా టీడీపీ నేతలు వాటిని అంత సీరియస్గా తీసుకోలేదు.
బాబు ఆందోళన చెందినట్టుగానే జగన్ సేవ్ విశాఖ ధర్నాకు సంబంధించి ఇంటిలిజెన్స్ విభాగం సమాచారం ప్రభుత్వానికి చేదు విషయాలు వివరించింది. భూ కుంభకోణాలపై విశాఖ వాసుల్లో ఇంతటి ఆగ్రహం, అసహనం నెలకొని ఉన్నాయా అని అధికార పార్టీ నేతలు ఆశ్చర్యపోతున్నారు. ఈ కుంభకోణాలు జిల్లాలో పార్టీకి ఎంత నష్టం కలిగిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.
హుద్హుద్ తుఫాను సమయంలో అప్రమత్తంగా వ్యవహరించి విశాఖ వాసుల వద్ద సంపాదించిన కాస్తంత మంచిపేరు ఈ భూ కుంభకోణాలతో కొట్టుకుపోతోందని చంద్రబాబు బాధపడుతున్నాడు. పెట్టుబడుల సదస్సు, ఆర్థిక రాజధాని పేరిట విశాఖ ప్రజల్లో ఆదరణ పొందాలని తాను ప్రయత్నిస్తుంటే అక్కడి నేతలు తన ఆశలపై నీళ్లు చల్లుతున్నారని బాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.
భూ కుంభకోణంలో మంత్రి గంటా శ్రీనివాసరావు పాత్ర ఉందని సంచలన ఆరోపణలు చేసిన మరోమంత్రి అయ్యన్న పాత్రుడు వర్గం కూడా జగన్ దీక్షకు సహకరించారని, జనాన్ని ధర్నాలో పాల్గొనేలా ప్రోత్సహించారని నిఘా వర్గాల సమాచారం. వాస్తు నిపుణల సూచనల మేరకు గతంలో ఉపయోగించిన ఒకటో నెంబరు గేటు కాకుండా రెండో నెంబర్ ఎంట్రన్స్ గుండా బాబు సచివాలయంలోకి అడుగుపెడుతున్నా చంద్రబాబును మరేవో దోషాలు వదిలిపెట్టినట్టు లేవు.