ప్రభాస్ కు మంచి విలన్ దొరికాడు

దాదాపు 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రాబోతున్న సాహో సినిమాకు విలన్ సమస్య తీరినట్టే కనిపిస్తోంది. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేష్ ను సాహో కోసం విలన్ గా తీసుకునే అవకాశాలున్నాయి. బాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ఐదేళ్ల నుంచి విలన్ గా మారిపోయాడు. పలు బాలీవుడ్ సినిమాల్లో ప్రతినాయకుడిగా మెప్పించాడు. ఇప్పుడు సాహోతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

నిజానికి సాహో కంటే ముందే తెలుగులో నటించాల్సింది నీల్ నితిన్. తమిళ్ లో వచ్చిన కత్తి సినిమాకు రీమేక్ గా తెలుగులో ఖైదీ నంబర్ 150 సినిమా వచ్చిన విషయం తెలిసిందే. కత్తిలో ఇతడే విలన్ గా నటించాడు. తెలుగు రీమేక్ లో కూడా ఇతడ్నే విలన్ గా తీసుకుంటారని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ అలా జరగలేదు. మళ్లీ ఇన్ని రోజులకు సాహోతో విలన్ గా టాలీవుడ్ లోకి ఎంటర్ అవుతున్నాడట నీల్ నితిన్.

సాహో సినిమాకు సంబంధించి హీరోయిన్ ను కూడా బాలీవుడ్ నుంచే తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల సినిమాకు బాలీవుడ్ లో రీచ్ పెరుగుతుందని భావిస్తున్నారు. బాహుబలి-2 తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో.. సాహోను ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ డీటెయిల్స్ ఇంకా బయటకు రాలేదు.

Show comments