సౌత్‌లోనే వెతుక్కుంటా: సయేషా

తొలి సినిమా 'అఖిల్‌'తో బొక్క బోర్లా పడింది బాలీవుడ్‌ బ్యూటీ సయేషా సైగల్‌. బాలీవుడ్‌లో 'శివాయ్‌' సినిమాలో నటించినా అక్కడా ఆమెకు ఆశించిన సక్సెస్‌ దొరకలేదు. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలతో బిజీగా వున్న సయేషా, సక్సెస్‌ని తాను సౌత్‌లోనే వెతుక్కుంటానంటోంది. సౌత్‌లో తొలి సినిమా 'అఖిల్‌' నిరాశపర్చినా, ఆ సినిమా తనకు ఎప్పటికీ వెరీ వెరీ స్పెషల్‌ అని చెబుతోంది. నటనలో ఓనమాలు నేర్చుకున్నది 'అఖిల్‌' సినిమాతోనేనని అంటోన్న సయేసా, టాలీవుడ్‌ నుంచి ఆఫర్లు వస్తున్నాయనీ, మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 

తమిళంలో జయం రవి హీరోగా నటిస్తున్న 'వనమగన్‌' సినిమాలోనూ, విశాల్‌, కార్తీ కాంబినేషన్‌లో కొరియోగ్రాఫర్‌ టర్న్‌డ్‌ డైరెక్టర్‌ ప్రభుదేవా రూపొందిస్తోన్న 'కరుప్పు రాజా వెళ్ళై రాజా' సినిమాలోనూ సయేషా నటిస్తోంది. సౌత్‌ సినిమాలతోపాటు, బాలీవుడ్‌ సినిమాల నుంచీ ఆఫర్లు వస్తున్నప్పటికీ, సౌత్‌ సినిమాల్లో బిజీగా వుండడం వల్లే బాలీవుడ్‌కి టైమ్‌ కేటాయించలేకపోతున్నానని చెబుతోంది సయేషా. 

సౌత్‌లో సినిమాలు వేగంగా తెరకెక్కుతాయనీ, బాలీవుడ్‌లో ఓ సినిమాకి కమిట్‌ అయితే, ఎక్కువ కాలం ఆ సినిమాతోనే సరిపోతుందనీ, అలాగని బాలీవుడ్‌ సినిమాల గురించి తాను తక్కువ చేసిన మాట్లాడటంలేదంటూ చాలా తెలివిగా సమాధానమిచ్చిందీ బ్యూటీ.

Show comments