అప్పుడు చిరంజీవి.. ఇప్పుడు రజనీకాంత్‌ అల్లుడు

'నేను చిరంజీవి కొడుకునే.. కావాలంటే ఇవిగో ఆధారాలు.. చూస్కోండి..' అంటూ కొన్నాళ్ళ క్రితమే ఓ వ్యక్తి మీడియా ముందుకొచ్చాడు. పైగా, 'పసివాడి ప్రాణం' సినిమాలో చిన్నపిల్లాడిలా నటించింది కూడా తానేనన్నాడు. జస్ట్‌, మీడియాకి ఓ న్యూస్‌ అయ్యిందే తప్ప, అప్పట్లో ఆ వ్యవహారం పెద్దగా ఇంపాక్ట్‌ చూపలేకపోయింది. అందరికీ తెల్సిన విషయమే 'పసివాడి ప్రాణం' సినిమాలో చిన్నపిల్లాడిగా నటించింది, బుల్లితెర నటి సుజిత అని. ఆ సుజిత అన్నయ్య సూర్యకిరణ్‌ తెలుగులో 'సత్యం', 'ధన' చిత్రాలకి దర్శకుడు. 

ఇక, తాజాగా మళ్ళీ అలాంటిదే ఇంకో వివాదం తెరపైకొచ్చింది. ఈసారి తమిళ హీరో ధనుష్‌ తమ కుమారుడేనంటూ ఓ వృద్ధ జంట న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ధనుష్‌, ప్రముఖ తమిళ దర్శకుడు కసూరీరాజా తనయుడు. అయితే, న్యాయస్థానం మాత్రం, స్వయంగా హాజరు కావాలంటూ దనుష్‌కి నోటీసులు జారీ చేసింది. తమ కొడుకునేంటున్న ఆ వృద్ధ జంట డీఎన్‌ఏ పరీక్షలకూ సిద్ధమంటోంది. ఇది మరీ చిత్రం. 

ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయాడట ధనుష్‌. సినిమాల మీద మోజుతో సినీ రంగంలోకి వెళ్ళాడన్నది ఆ వృద్ధ జంట ఆరోపణ. వినడానికి కామెడీగానే వున్నా, న్యాయస్థానం ధనుష్‌కి నోటీసులు పంపింది గనుక, ఈ వివాదాన్ని ఆషామాషీగా లైట్‌ తీసుకోవడానికి వీల్లేదేమో.! అయినా సెలబ్రిటీల్ని పట్టుకుని ఇదేం న్యూసెన్స్‌.? అనేవారూ లేకపోలేదు. ధనుష్‌ ఎపిసోడ్‌ తర్వాత, సెలబ్రిటీలకు ఇలాంటి చిక్కులు ముందు ముందు మరిన్ని ఎదురవక తప్పేలా లేదు. 

ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేసిన రాజకీయ కురువృద్ధుడు ఎన్‌డి తివారీ కొడుకునంటూ ఓ వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించి, అప్పట్లో హల్‌చల్‌ చేసిన విషయం విదితమే.

Show comments