ఇండియాలో జీరో.. పాకిస్తాన్‌లో హీరో.!

ఒక్క మాట.. ఆయన్ని రాత్రికి రాత్రి ఇండియాలో జీరోని చేసేసింది.. అదే సమయంలో ఆయన్ని పాకిస్తాన్‌లో హీరోని చేసేసింది. అతనెవరో కాదు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌. 

ఇటీవల పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత సైన్యం చేపట్టిన సర్జికల్‌ స్ట్రైక్స్‌పై ఆధారాల కోసం అరవింద్‌ కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేసిన విషయం విదితమే. ఈ వ్యవహారం పాకిస్తాన్‌ దాకా చేరింది. పాకిస్తాన్‌ మీడియా వున్నపళంగా అరవింద్‌ కేజ్రీవాల్‌ని హీరోని చేసేసింది. 'పెర్‌ఫెక్ట్‌ డిమాండ్‌..' అంటూ అరవింద్‌ కేజ్రీవాల్‌ని పాక్‌ మీడియా మోసేసింది. నరేంద్రమోడీ అబద్ధాలకి అరవింద్‌ కేజ్రీవాల్‌ ధీటైన సమాధానం.. అంటూ పాకిస్తాన్‌ మీడియా కేజ్రీవాల్‌ని మోసేయడంతో బీజేపీ అలర్ట్‌ అయ్యింది. 

'మీరు ఎవర్ని ప్రశ్నిస్తున్నారు.? భారత ప్రభుత్వాన్నా.? భారత సైన్యాన్నా.? భారత సైన్యాన్ని ప్రశ్నించే నైతిక హక్కు మీకెక్కడిది.? ప్రాణ త్యాగాలతో సరిహద్దుల్లో శతృవుల నుంచి దేశాన్ని కాపాడుతున్న భారత సైన్యం ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసేలా మీరెలా మాట్లాడగలుగుతున్నారు.? మీ నోట పాకిస్తాన్‌ వాయిస్‌ రావడమేంటి.?' అంటూ బీజేపీ నేతలు కేజ్రీవాల్‌పై దుమ్మెత్తిపోశారు. 

'నరేంద్రమోడీకి సెల్యూట్‌ చేస్తున్నా.. అదే సమయంలో సర్జికల్‌ స్ట్రైక్స్‌కి సంబంధించి ఆధారాలు విడుదల చేయాలి..' అంటూ కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించడమే ఇంత వివాదానికీ కారణం. 'కేజ్రీవాల్‌, మోడీకీ అలాగే భారత సైన్యానికీ సెల్యూట్‌ చేశారు.. కానీ ప్రజలకు వాస్తవాలు తెలియాలి.. కేజ్రీవాల్‌ అదే అడిగారు.. ఈ విషయంలో కేజ్రీవాల్‌ని తప్పు పట్టడం బీజేపీకి తగదు..' అంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు డ్యామేజీ కంట్రోల్‌ చర్యలకు దిగారు. 

ఇంకోపక్క, సర్జికల్‌ స్ట్రైక్స్‌కి సంబంధించి ఆధారాలు చూపాలంటూ ఇప్పుడిప్పుడే కాంగ్రెస్‌ నేతలే డిమాండ్లు షురూ చేశారు. 'అతి త్వరలో ఆ వీడియోల్ని విడుదల చేస్తాం..' అని ఇప్పటికే కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రకటించినప్పటికీ, కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీలకు తొందరెక్కువైపోయినట్లే కన్పిస్తోంది. ఆ సంగతెలా వున్నా, పాకిస్తాన్‌ మీడియాలో మాత్రం, మన పొలిటీషియన్లకు మంచి డిమాండ్‌ పెరిగిపోయింది. పాకిస్తాన్‌ సిట్యూయేషన్‌ అలాంటిది మరి.! 

ఇదిలా వుంటే, బాలీవుడ్‌ నటుడు ఓంపురి, 'సైన్యాన్ని తుపాకీలు పట్టుకుని ఎవరు అక్కడ నిలబడమన్నారు.. ప్రాణాలు పోగొట్టుకోమని చెప్పారు.. అసలు సైన్యంలో చేరమని వారిని ఎవరైనా కోరారా.?' అంటూ సైన్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, వార్తల్లోకెక్కాడు. ఇట్‌ హ్యాపెన్స్‌ ఓన్లీ ఇన్‌ ఇండియా. శవాల మీద పేలాలు ఏరుకోవడం.. అంటే ఇదే మరి.! 

ఇండియా - పాకిస్తాన్‌ మధ్య యుద్ధమంటూ జరిగితే.! అన్న చర్చ జరుగుతున్న సందర్భంలోనే దేశంలోని 'ప్రముఖులు' ఇలా భిన్న స్వరాలు విన్పిస్తోంటే, పొరుగు దేశం దృష్టిల్లో మనం పలచనైపోకుండా వుంటామా.? దేశమంటే మట్టి కాదోయ్‌.. దేశమంటే మనుషులోయ్‌.. అని ఓ పెద్దాయన చెప్పాడు. కానీ, దేశమంటే మనుషులు కాదు.. దేశమంటే మట్టి మాత్రమేనని ఈ సోకాల్డ్‌ మేధావులు నిరూపిస్తున్నారంతే. ఇలాంటోళ్ళని దేశద్రోహులు.. అని ఎందుకు అనకూడదు.?

Show comments