కోర్టును ఆశ్రయించే అవకాశం ఎవరికైనా వుంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. అయితే, 'విచారణను ఎదుర్కొంటాం..' అని చెప్పి, న్యాయస్థానాన్ని ఆశ్రయించడమంటే, ఆయా వ్యక్తుల 'నైతికత'పై అనుమానాలు వెల్లువెత్తడం సహజమే.!
'మిమ్మల్ని ఎవరైనా కిందికి లాగాలనుకుంటున్నారంటే, దానర్థం.. మీరు వాళ్ళకన్నా చాలా ఎత్తులో వున్నట్లే..' అంటూ సోషల్ మీడియాలో ఓ 'కోట్' పోస్ట్ చేసింది నటి ఛార్మి. డ్రగ్స్ కేసులో ఛార్మిపై ఆరోపణలు రావడంతో, ఆమె మొట్టమొదట స్పందించిన తీరు ఇది. దర్శకుడు పూరి జగన్నాథ్తో కలిసి ఛార్మి 'పూరి కనెక్ట్స్' అనే సంస్థను నిర్వహిస్తోన్న విషయం విదితమే. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటోన్న 'పూరి గ్యాంగ్'లో ఛార్మి కూడా వుందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!
పూరి జగన్నాథ్ ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. ఛార్మి ఈ నెల 26న విచారణకు హాజరు కావాల్సి వుంది. ఈలోగా, ఛార్మి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ సందర్భంగా 'రక్త నమూనాలు, వెంట్రుకల నమూనాలూ తీసుకోవడం' ఛార్మికి అభ్యంతరకరంగా అన్పించింది. ఇదే విషయాన్ని ఛార్మి పిటిషన్లో పేర్కొన్నారు. ఇప్పటిదాకా విచారణకు హాజరైన నలుగురు సినీ ప్రముఖులకు సంబంధించి 'నమూనాల్ని' ఎక్సయిజ్ ఎన్ఫోర్స్మెంట్ 'సిట్' సేకరించిన విషయం విదితమే.
మరి, ఛార్మి విషయంలో ఏం జరుగుతుంది.? ఏమోగానీ, అసలు డ్రగ్స్తో సంబంధం లేనప్పుడు శాంపిల్స్ తీసుకుంటే అభ్యంతరమేంటన్న చర్చ సినీ పరిశ్రమలో జరుగుతోంది.