పరిటాల శ్రీరామ్.. సొంత వాళ్లనూ కాపాడలేకపోయాడా!

ఇప్పుడు కాదు.. కొన్ని నెలలుగా తమకు ప్రాణభయం ఉందని అనంతపురం శివార్లలోని తెలుగుదేశం నేతలు మొరపెట్టుకొంటూ వచ్చారు. అది మరెవరికో కాదు.. పరిటాల శ్రీరామ్ కే! ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పరిటాల సునీతకు, ఆమె తనయుడు శ్రీరామ్ కు వీరు తమ పరిస్థితిని మొరపెట్టుకున్నారు. మీడియా సమక్షంలో కూడా తమకు ప్రాణభయం ఉందని వీరు చెప్పారు. ఈ విషయాన్ని శ్రీరామ్ కు చెప్పామని కూడా వివరించారు. 

ఎవరైతే ఇలా ప్రాణభయం ఉందన్నారో.. వారు ఇప్పుడు దారుణంగా హత్యకు గురయ్యారు! అధికార పార్టీకి చెందిన వారు, పరిటాల అనుచరులిద్దరిని ప్రత్యర్థులు ఒకేసారి మట్టుబెట్టారు. మరి ఈ పని చేసింది ఏ తెలుగుదేశం విరోధులో కాదు.. తెలుగుదేశం వారే అని పరిటాల వర్గీయులు చెబుతున్నారు. అనంతపురం ఎమ్మెల్యేల ప్రభాకర్ చౌదరి నుంచి తమకు ప్రాణభయం ఉందని చాన్నాళ్లుగా భయాందోళనలు వ్యక్తం చేస్తూ వచ్చిన పరిటాల అనుచరులిద్దరు హత్యకు గురయ్యారు. వీరి ప్రత్యర్థులు వీరిని వేట కొడవల్ల తో నరికి చంపారు. 

హతులు గోపీ నాయక్ , వెంకటేష్ నాయక్ లు.. కొన్ని నెలల నుంచి ప్రభాకర్ చౌదరి మనుషులు తమను చంపేస్తారని ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. చివరకు వారి భయమే నిజమైంది.  మరి ఎవరు చేశారు? అంటే… ప్రభాకర్ చౌదరి మనుషులే అని హతుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ప్రభాకర్ చౌదరికి, పరిటాల వర్గానికి బోలెడన్ని విబేధాలున్నాయి. తన నియోజకవర్గంలో శ్రీరామ్ జోక్యానికి చౌదరి ఒప్పుకోవడం లేదు. గోపి, వెంకటేష్ నాయక్ ల ఆందోళన నేపథ్యంలో కూడా చౌదరి, శ్రీరామ్ వర్గాల మధ్య విబేధాలు తారాస్థాయికి వెళ్లాయి. 

ఇప్పుడు ఏకంగా వారి భయమే నిజమైంది. మొత్తానికి అధికారంలో ఉంటే.. ప్రత్యర్థి పార్టీలోని వారిని మట్టుబెట్టే సంప్రదాయాన్ని కలిగిన తెలుగుదేశం వాళ్లు ఇప్పుడు తమలో తాము కూడా నరుక్కొంటున్నారనే వ్యాఖ్య వినిపిస్తోంది జిల్లాలో. హతులు ‘చంద్రబాబు కొట్టాల’కు చెందిన వారు. తన హయాంలో శాంతి భద్రతలు అదుపులో ఉంటాయనే చంద్రబాబునాయుడు పేరుతో ఉన్న నగర్ వాసులే ఇలా హత్యకు గురయ్యారు.

Show comments