మాటలకన్నా బూతులే ఎక్కువ.!

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఇప్పుడు సినీ నటుడు, హిందూపూర్‌ ఎమ్మెల్యే బాలకృష్ణ పేరు మార్మోగిపోతోంది. అదీ, ఆయన పీఏ శేఖర్‌ పుణ్యమా అని. ఓ ఆడియో టేప్‌ బయటకొచ్చింది పీఏ శేఖర్‌కి సంబంధించి. నియోజకవర్గంలో 'పనులకు' సంబంధించి, కిందిస్థాయి టీడీపీ నేతలు, కాంట్రాక్టర్లు బాలయ్యను అప్రోచ్‌ అయ్యే పరిస్థితి లేదు. మొత్తం వ్యవహారాన్ని పీఏ శేఖర్‌ చక్కబెట్టేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీల దగ్గర పీఏలు అన్ని వ్యవహారాలు చక్కబెట్టేయడం మామూలేననుకోండి.. అది వేరే విషయం. 

అయితే, ఇక్కడ 'అవినీతిని' చక్కబెట్టేస్తుండడమే అసలు వివాదానికి కారణం. 'బాలయ్యతో మాట్లాడాం..' అన్న మాట అవతలి వ్యక్తి నుంచి వస్తే చాలు, పీఏ శేఖర్‌ నోట మాటల కన్నా, బూతులెక్కువైపోతున్నాయి. బాలయ్య పీఏ శేఖర్‌తో వేగలేక, ఆయన వేధింపులు భరించలేక కొందరు, 'అయ్యగారి' బాగోతాన్ని ఆడియో టేపు రూపంలో బయటపెట్టేశారు. అంతే, మొత్తంగా బాలకృష్ణ పరువు గంగలో కలిసిపోయింది. 

ఇంత జరుగుతున్నా, ఈ వ్యవహారంపై ఇప్పటిదాకా ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించకపోవడం గమనార్హం. ఈ ఎపిసోడ్‌లో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న దరిమిలా, బాలకృష్ణ స్పందించి తీరాల్సిందే. నియోజకవర్గంలో పీఏ ముసుగులో టీడీపీ అవినీతికి పాల్పడుతోందంటూ విపక్షాలు దుమ్ముత్తి పోస్తున్నాయి. టీడీపీలో అంతర్గత కుమ్ములాటల కారణంగా తెరపైకొస్తున్న ఈ అవినీతి ఆరోపణలపై సమాధానమిచ్చేదెవరు.?

Show comments