సుజనా.. పందికీ, నందికీ తేడా తెలుసా?

కేంద్ర మంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరి, ప్రత్యేక హోదా ఉద్యమకారుల్ని 'పందుల పందాలు ఆడుకోండి..' అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. 'జల్లికట్టుకీ ప్రత్యేక హోదాకీ సంబంధమేంటి.? జల్లికట్టు అయినా ఆడుకోండి, కోడి పందాలు అయినా ఆడుకోండి.. పందుల పందాలు అయినా ఆడుకోండి.. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం.. దాని గురించి మాట్లాడటం అనవసరం..' అని తేల్చేశారాయన. 

ఇదే సుజనా చౌదరి, కేంద్ర మంత్రి అయ్యాక కూడా ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్నామని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం అవసరమైతే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమన్నారు. ప్రత్యేక హోదా కన్నా బీజేపీతో పొత్తు ముఖ్యం కాదని చెప్పారు. కానీ, ఇప్పుడు మాట మార్చారు. ప్రత్యేక హోదాని మించి, ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిందని సుజనా చౌదరి చెబుతున్నారు. 

అయితే, సుజనా చౌదరి 'పందుల పందాల'కు 'ఆంధ్రప్రదేశ్‌ యువత' గట్టిగానే కౌంటర్‌ ఇస్తోంది. ప్రత్యేక హోదా నంది అయితే, ప్రత్యేక ప్యాకేజీ పంది.. అంటూ సరికొత్త పోస్టింగులతో సోషల్‌ మీడియాలో ఆంధ్రప్రదేశ్‌ యువత తెగేసి చెబుతోంది. వింటున్నారా కేంద్ర మంత్రిగారూ.. పందులతో పండగ చేసుకుంటున్నదెవరో.?

Show comments