కాంగ్రెస్ కు ఇంతకు మించి దిక్కులేదా..!

కాంగ్రెస్ దుస్థితి అంటే.. అది కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన వ్యవహారం కాదు. దేశ వ్యాప్తంగా ఇదే దరిద్రమే కంటిన్యూ అవుతున్నట్టుగా ఉంది ఆ పార్టీకి. లేకపోతే.. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ఏదో ఉత్సాహవంతంగా రెడీ అవుతుందని అనుకుంటే.. ఆఖరికి షీలా దీక్షిత్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేల్చేసిందట ఆ పార్టీ! ఇంతకు మించి నేత లేకపోవడం కాంగ్రెస్ పార్టీ దుస్థితికి నిదర్శనం తప్ప మరోటి అవుతుందా?

ఇప్పటికే షీలా దీక్షిత్ సత్తా ఏమిటో తెలిసిపోయింది. తను ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఢిల్లీలో కనీసం ఎమ్మెల్యేగా గెలవలేకపోయిందామె! అవినీతి కూపంలో పీకల్లోతు వరకూ మునిగిన వ్యక్తి షీలా దీక్షిత్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె చిత్తుగా ఓడిపోయారు! అక్కడ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని.. పార్టీని గెలిపించడం మాట అటుంచి.. కనీసం ఎమ్మెల్యేగా గెలవలేకపోయిందామె! ఒకవైపు ఆప్ ప్రభుత్వం షీలా దీక్షిత్ వ్యవహారాలపై, ఆమె తనయుడి వ్యవహారాలపై విచారణలు కొనసాగిస్తోంది.

మరి ఇలాంటి నేపథ్యంలో ఆల్రెడీ ఢిల్లీలో పార్టీ పుట్టి ని ముంచేసిన షీలానే యూపీకి కూడా చుక్కానిగా మార్చుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. యూపీ ఎన్నికల విషయంలో కాంగ్రెస పార్టీ ఒక విషయంలో గట్టిగా నిలబడింది. అక్కడ ఎటు తిరిగీ బ్రహ్మణ కులానికి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. 

ఈ రాష్ట్రంలో ఆ కులస్తులకు కాంగ్రెస్ తో దూరం బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో బ్రహ్మణ వర్గానికి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని చాలా కసరత్తు చేసింది. రాహుల్ గాంధీని కశ్మీరీ పండిట్ గా లెక్కేసి.. ఆయనను యూపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించాలనే డిమాండ్ కూడా వినిపించింది కాంగ్రెస్ యూపీ విభాగం నుంచి. 

అయితే ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలవాల్సిన వ్యక్తి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకూడదన్నట్టుగా కాంగ్రెస్ అధిష్టానం షీలాను తీసుకొచ్చింది. మరి ఢిల్లీ ప్రజల తిరస్కరణకు గురి అయిన ఆమె యూపీలో సాధించేది ఏముంది? ఈ తొలి అడుగు ద్వారానే కాంగ్రెస్ పార్టీ యూపీలో చిత్తయిపోయిందని వేరే చెప్పాలా? 

Show comments