సారీ క్యాన్సిల్…వర్మ అడ్డం తిరిగాడు!

జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మెగాబ్రదర్‌ నాగబాబు, ఎక్కడా రామ్‌గోపాల్‌ వర్మ పేరు ప్రస్తావించలేదు. కానీ, ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. చాలా దారుణమైన పదజాలంలో వర్మని నాగబాబు విమర్శించడం కాదు, తిట్టి పోసేసిన విషయం విదితమే. 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో వర్మతోపాటు, యండమూరి వీరేంద్రనాథ్‌పైనా విరుచుకుపడ్డారు నాగబాబు. 

నాగబాబు వ్యాఖ్యలపై యండమూరి వీరేంద్రనాథ్‌ వివరణ ఇచ్చుకున్నారు. ఇదంతా చాలా చిన్న విషయం, పట్టించుకోవాల్సిన అవసరం లేదనేశారు. ఏమో, మళ్ళీ నాగబాబుతో సినిమా చేస్తానేమో.. అంటూ యండమూరి వివాదానికి ముగింపు పలికేశారు. అంతకుముందే వర్మ కూడా, నాగబాబుకి సరెండర్‌ అయిపోయారు. క్షమాపణ చెప్పేశారు. కానీ, కాస్సేపటికే ట్విస్ట్‌. అదంతా తాను చేసిన ట్వీట్ల వ్యవహారం కాదనీ, తన ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయ్యిందనీ వర్మ చెబుతూ, తనదైన స్టయిల్లో కామెంట్లు షురూ చేసేశారు. 

'మీ అన్నయ్యకి వున్న గ్రేట్‌నెస్‌లో 0.1శాతం కూడా మీకు లేదు.. నన్ను ప్రశ్నించేముందు మీరు ఏం చేస్తున్నారో ప్రశ్నించుకోండి..' అంటూ నాగబాబు జడ్జ్‌గా వ్యవహరిస్తున్న 'జబర్‌దస్త్‌' కామెడీ షోని ప్రస్తావించిన వర్మ, 'నాగబాబుకి ఇంగ్లీషు రాదేమో, ఇంగ్లీషు వచ్చిన వ్యక్తితో నా ట్వీట్లను ట్రాన్స్‌లేట్‌ చేయించుకోవాలి..' అంటూ కౌంటర్‌ వేసేశారు. 

ముందు సారీ చెప్పేసి, తర్వాత తూచ్‌ అనేసి.. ఓ 'ఇడియట్‌' తన ట్విట్టర్‌ అకౌంట్‌ని హ్యాక్‌ చేశారని తాను చెప్పేసిన 'క్షమాపణ'ని చెప్పలేదని వర్మ పేర్కొనడమంటే.. దటీజ్‌ వర్మ.. అని అనకుండా వుండలేం. డ్యామేజీ అయితే జరిగిపోయింది.. 'అక్కుపక్షి..' అంటూ నాగబాబు పేరు చెప్పకుండానే విమర్శిస్తే, ఆ అక్కుపక్షిని తానేనన్నట్లుగా వర్మ తొందరపడి స్పందించడం.. హాస్యాస్పదం కాక మరేమిటి.?

Show comments