అస్సలు తగ్గేది లేదంటున్న మహేష్

సెప్టెంబర్ 21న జై లవకుశ రిలీజ్ అవుతోంది. ఇక సెప్టెంబర్ 29న పైసా వసూల్ వస్తోంది. ఈ రెండు సినిమాల కంటే ముందే సెప్టెంబర్ లో వస్తున్నామని ప్రకటించిన మహేష్ సినిమాపై మాత్రం అనుమానాలు అంతకంతకు పెరుగుతూ వచ్చాయి.

దీనికి కారణం స్పైడర్ షూటింగ్ ఇంకా పూర్తికాకపోవడం, గ్రాఫిక్ వర్క్ కు చాలా టైం పట్టేట్టు కనిపించడమే. కానీ ఈసారి మేకర్స్ మరింత క్లారిటీ ఇచ్చారు. ఎట్టిపరిస్థితుల్లో సెప్టెంబర్ 27న స్పైడర్ సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చి తీరుతామని మరోసారి స్పష్టంగా చెప్పేశారు నిర్మాతలు.

అన్నపూర్ణ స్టుడియోలో స్పైడర్ సినిమాకు సంబంధించి తాజాగా ఒక పాట షూటింగ్ పూర్తిచేశారు. మరో పాట షూటింగ్ పెండింగ్ ఉంది. ఆగస్ట్ మొదటి వారంలో ఆ ఒక్క పాటను కూడా పూర్తిచేయబోతున్నారు.

మరోవైపు ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ ను ఒకేసారి 6 దేశాల్లో కంప్లీట్ చేస్తున్నారు. ఇండియాతో పాటు బ్రిటన్, ఇరాన్, రష్యా లాంటి దేశాల్లో గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. కాబట్టి సినిమా విడుదలలో ఎలాంటి జాప్యం ఉండదంటోంది యూనిట్.

స్పైడర్ రాక కూడా పక్కా అవ్వడంతో ఈసారి దసరా పోటీ మరింత రంజుగా మారింది. ఎన్టీఆర్, మహేష్ సినిమాలు వారం గ్యాప్ లో థియేటర్లలోకి వస్తుండగా.. అటు బాలకృష్ణ, మహేష్ సినిమాలు మాత్రం జస్ట్ 2 రోజుల గ్యాప్ లో బాక్సాఫీస్ బరిలో తలపడబోతున్నాయి.

Show comments