రేవంత్ రెడ్డి కెలికేస్తున్నాడుగా?

హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన డ్రగ్స్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించాలంటూ తెలుగుదేశం తెలంగాణ విభాగం నాయకుడు రేవంత్ రెడ్డి కోర్టు తలుపు తట్టారు. ఇది ఏసి-డిసి ఆట లాంటిది. రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ లో సత్తా వుండి, కోర్టు కూడా దాన్ని ఆమోదించి, ఏమాత్రం అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చినా పరిస్థితి వేరుగా వుంటుంది.

ఎందుకంటే కేంద్ర నిఘా సంస్థల దర్యాప్తు తీరు పూర్తిగా భిన్నంగా వుంటుంది. పైగా వేగంగా వుంటుంది. పైగా పరిశోధన వరకు దానికి ఏ పగ్గాలు వుండవు. ఆ తరువాత నత్తనడక నడిస్తే వేరే సంగతి కానీ, పరిశొధన, చార్జి షీట్ వరకు తరతమ బేధాలు లేకుండా దూసుకుపోతుంది. అందుకే ఇఫ్పుడు రేవంత్ రెడ్డి పిటిషన్ పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందా అన్నది ఆసక్తి కరంగా మారింది. 

ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో డ్రగ్స్ హడావుడి సద్దు మణుగుతోంది. అలాగే అంతకు ముందు బడా స్కూళ్ల వ్యవహారం తెరపైకి వచ్చినట్లే వచ్చి, సద్దు మణిగింది. ఇలాంటి టైమ్ లో కోర్టు కనుక, రేవంత్ రెడ్డి పిటిషన్ పై అనుకూల స్పందన కనబర్చి, కేంద్ర సంస్థలు రంగ ప్రవేశం చేస్తే, పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చే అవకాశం వుంటుంది. 

టీఆర్ఎస్ నా? టాలీవుడ్ నా? ఎవర్ని ఇరుకున పెట్టాలని రేవంత్ రెడ్డి ఈ పిటిషన్ వేసారో కానీ, మొత్తం మీద ఆయన తేనెతుట్టనకు కదిల్చేపని పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. పోనీ ఇది కేవలం తెలంగాణ కే పరిమితమా అంటే అదీ కాదు.

తెలంగాణ దర్యాప్తు సంస్థలు ఇప్పటికే డ్రగ్స్ జాఢ్యం, ఆంధ్రకు కూడా పాకినట్లు కనిపెట్టాయని వార్తలు వినవచ్చాయి. మరి ఏ పరిస్థితుల వల్లనైనా కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగప్రవేశం చేసాయంటే అక్కడి తేనె తుట్టలు కూడా కదుల్తాయి. చూడాలి కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో? ఏం జరుగుతుందో?

Show comments