ఆ పుకారుపై క్లారిటీ ఇచ్చిన సాయిధరమ్ తేజ

కెరీర్ స్టార్ట్ చేసిన తక్కువ కాలమే అయినప్పటికీ సాయిధరమ్ తేజపై నిత్యం ఏదోఒక పుకారు షికారు చేస్తూనే ఉంటుంది. ఆమధ్య కొంతమంది హీరోయిన్లను లింక్ చేస్తూ సాయిధరమ్ తేజపై వార్తలు బాగానే పుట్టుకొచ్చాయి. ఇప్పుడవన్నీ చల్లారిపోయాయనుకోండి అది వేరే విషయం. తాజాగా సాయిధరమ్ తేజ కెరీర్ కు సంబంధించి మరో న్యూస్ హైలెట్ అవుతోంది. ఎట్టకేలకు ఆ వార్తపై ఈ మెగా హీరో క్లారిటీ ఇచ్చాడు. 

ఖైదీ నంబర్ 150 సినిమా తర్వాత ఇప్పటివరకు మరో సినిమా ఎనౌన్స్ చేయని వీవీ వినాయక్... సాయిధరమ్ తేజ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడంటూ వార్తలొస్తున్నాయి. దీనికి సంబంధించి వినాయక్ ప్రీ-ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేశాడంటూ కథనాలు వచ్చాయి. ఎట్టకేలకు దీనిపై తేజూ స్పందించాడు. వినాయక్ తో తను సినిమా చేయడం లేదని ప్రకటించాడు. 

ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తేజూ ఈ విషయంపై స్పందిస్తూ ” వినాయక్ గారిని ఓ 2-3 సార్లు కలిశాను. కానీ అది సినిమా గురించి మాత్రం కాదు. ప్రస్తుతానికి మా కాంబినేషన్ లో సినిమా ఏమీలేదు. ప్రజెంట్ ‘జవాన్’ అనే సినిమా మాత్రమే చేస్తున్నా. కానీ ఛాన్స్ దొరికితే కచ్చితంగా వినాయక్ తో సినిమా చేస్తా. వినాయక్ తో సినిమా చేయాలనేది నా డ్రీమ్..” అని తెలిపాడు.

Show comments