కళ్యాణ్‌రామ్‌కి కథ కావలెను.!

ఎన్నో ఆశలు పెట్టుకున్న 'ఇజం' సినిమా నిరాశపరిచడంతో ఇంతకు ముందెన్నడూ లేని స్థాయిలో కళ్యాణ్‌రామ్‌లో నైరాశ్యం పెరిగిపోయిందట. నిజానికి కళ్యాణ్‌రామ్‌ కెరీర్‌లో విజయాలకన్నా పరాజయాలే ఎక్కువ. అయినా, నిర్మాతగా కళ్యాణ్‌రామ్‌ ఏనాడూ వెనుకడుగు వేయలేదు. 'ఓం' సినిమా తర్వాత కూడా కళ్యాణ్‌రామ్‌లో ఇంతటి నిస్తే కన్పించలేదు. 

కానీ, పూరి జగన్నాథ్‌ మీద కళ్యాణ్‌ రామ్‌ చాలా ఆశలు పెట్టుకోవడం, తీరా 'ఇజం' సినిమా అనుకున్న విజయం సాధించకపోయేసరికి ఎవర్నీ ఏమీ అనలేక కళ్యాణ్‌రామ్‌ ఇంతలా డీలాపడిపోతున్నాడని సినీ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. అయ్యిందేదో అయిపోయింది.. అని 'ఇజం' తర్వాత కళ్యాణ్‌రామ్‌ అనుకోలేకపోతున్నాడట. 

'పటాస్‌' సినిమాతో విజయం వచ్చినట్టే వచ్చి, ఆ తర్వాత మళ్ళీ కెరీర్‌ ఇలా అయోమయంలో పడిపోవడంతో, కళ్యాణ్‌రామ్‌కి ఇప్పుడు ఏంచేయాలో పాలుపోవడంలేదు. నిర్మాతగా వరుస సినిమాలు చేద్దామనుకున్న కళ్యాణ్‌రామ్‌, కుదురుకోవడానికి చాలా టైమే పట్టేలా వుందంటున్నారు ఆయన సన్నిహితులు. మరోపక్క, 'ఇజం' తర్వాత 'బ్రదర్స్‌' పేరుతో కళ్యాణ్‌రామ్‌ ఓ సినిమా నిర్మించాలనుకున్నాడు. ఇప్పుడిప్పుడే దాని గురించిన ఆలోచనలు మళ్ళీ మొదలెట్టాడట కళ్యాణ్‌రామ్‌. 

ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ - పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లోనే ఈ 'బ్రదర్స్‌' వస్తుందని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ, ప్రస్తుతానికి ఆ ఆలోచనలు పక్కన పెట్టేసి, ఇంకెవరితోనన్నా ఆ సినిమా చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కళ్యాణ్‌రామ్‌ దగ్గర 'బ్రదర్స్‌' టైటిల్‌ మాత్రమే వుందనీ, దానికి కథ కూడా లేదనీ తెలుస్తోంది. కథకి టైటిల్‌ సెలక్ట్‌ చేయడం మామూలే.. ఇప్పుడు టైటిల్‌కి కథ కావాలన్నమాట. కథ దొరికితే డైరెక్టర్‌ సహా మొత్తం టీమ్‌ ఏర్పాటువుతందనే ఆలోచనలో వున్నాడిప్పుడు కళ్యాణ్‌రామ్‌. నిర్మాతగా దెబ్బలు మామూలే కావడంతో, కోలుకుని కళ్యాణ్‌రామ్‌ త్వరలోనే రెగ్యులర్‌ వర్క్‌లో పడ్తాడనే ఆశిద్దాం.

Show comments