సినిమా సెట్‌ తగలెట్టేశారు.!

'మనోభావాలు' దెబ్బతిన్నాయనే పేరుతో సినిమాలపైనా, సినిమా షూటింగులపైనా, సినిమాలోని నటీనటులపైనా దాడులు జరగడం కొత్తేమీ కాదు. తెలంగాణ ఉద్యమంలో ఇలాంటివి చాలానే జరిగాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇలాంటి వివాదాలతో చర్చనీయాంశమైన సినిమా 'పద్మావతి'. తమ మనోభావాల్ని దెబ్బతీశారంటూ, ఆల్రెడీ ఓ సారి 'పద్మావతి' సినిమా యూనిట్‌పై దాడి చేశారు 'రాజ్‌పుట్‌ కర్ని సేన' పేరుతో కొందరు. చరిత్రను వక్రీకరిస్తున్నారన్నది వారి ఆవేదన. 

తాజాగా, మరోమారు 'పద్మావతి' సినిమా యూనిట్‌పై దాడి జరిగింది. ఈసారి సినిమా సెట్‌ని తగలబెట్టేశారు. భారీ మొత్తంలో ఖర్చు చేసి ఈ సెట్ రూపొందించారట. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ 'పద్మావతి' సినిమాని పూర్తి కానివ్వబోమనీ, ఎలాగోలా సినిమాని పూర్తి చెయ్యాలనుకుంటే, థియేటర్లను సైతం తగలబెట్టేస్తామంటూ రాజ్‌పుట్‌ కర్ని సేన హెచ్చరిస్తోంది. మరోపక్క, సినిమాలో ఏముందో తెలియకుండా, సినిమాపై ముందస్తు దాడి ఎంతవరకు సమంజసం.? అని ప్రశ్నిస్తున్నాడు సంజయ్‌ లీలా భన్సాలీ. ఆయనకు పలువురు బాలీవుడ్ ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది.

దీపికా పడుకొనే, రణ్‌వీర్‌సింగ్‌, షాహిద్‌ కపూర్‌ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన తారాగణం. సంజయ్‌ లీలీ భన్సాలీ అంటే, భారీ చిత్రాలకు పెట్టింది పేరు. అత్యంత భారీతనంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారాయన. మరోపక్క, దీపికా పడుకొనే తన కెరీర్‌లోనే ది బెస్ట్‌ రోల్‌.. అంటూ 'పద్మావతి' గురించి చెబుతోంది. రాణి పద్మావతి పాత్రలో దీపిక నడిస్తోంది. ఆ పాత్రకు ఎంతో పవిత్రత వుందనీ, ఆ పవిత్రతను సినిమాతో చెడగొడ్తున్నారన్నది రాజ్‌పుట్‌ కర్ని సేన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే సినిమాపై వరుస దాడులు జరుగుతున్నాయి. తాజా ఉదంతంతో చిత్ర యూనిట్‌ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది.

కొసమెరుపు: గతంలో ‘పద్మావతి‘పై దాడి జరిగింది జైపూర్ లో. ఇప్పుడు దాడి మహారాష్ట్రలో సినిమా సెట్ తగలబడింది.

Show comments