తెలుగు చలన చిత్ర రంగంలో దాసరి నారాయణరావు అనేక మందికి గురువు లాంటి వారు. కానీ మోహన్ బాబుకు అంతకంటే ఎక్కువ. సినిమా రంగంలో దాసరి తనకు తండ్రి అని మోహన్ బాబు చెప్పుకుంటారు. శివరంజని మూవీతో మోహన్ బాబును వెండితెరకు పరిచయం చేసిన దాసరి ఆ తరవాత దాదాపు తన ప్రతి సినిమాలోనూ కీలక పాత్ర ఇచ్చి కలెక్షన్ కింగ్ కు స్టార్ డమ్ తీసుకొచ్చాడు. అందుకు గాను దాసరి పట్ల ఎల్లప్పుడూ ఎనలేని విధేయత, గౌరవమర్యాదలు ప్రదర్శించాడు మోహన్ బాబు.
అయితే ఇప్పుడు అంతిమ గడియ రానే వచ్చింది. తండ్రి లాంటి మరణం మోహన్ బాబును తీవ్ర మనోవేదనకు గురిచేసింది. రామారావు మరణం తరవాత మోహన్ బాబు ఇంతగా రోదించింది ఇప్పుడేనని సన్నిహితులు చెప్తున్నారు. ఇంత బాధలో కూడా దాసరి అంత్యక్రియల్లో కొడుకులా వ్యవహరించి దాసరి పట్ల అభిమానం చాటుకున్నడని మోహన్ బాబును సినీపెద్దలు మెచ్చుకుంటున్నారు.
కిమ్స్ ఆస్పత్రిలో దాసరి మరణ వార్త తొలిగా తెలిసింది మోహన్ బాబుకే. విషయం తెలియగానే చిన్న కొడుకు మనోజ్ తో కలిసి అక్కడికి చేరుకున్న బాబు తనే స్వయంగా దగ్గరుండి అంబులెన్స్ లో దాసరి భౌతిక కాయాన్ని ఇంటికి తీసుకువచ్చాడు.
మంగళవారం రాత్రి నుండి నిద్రాహారాలు మాని దాసరి శవపేటిక దగ్గరే ఉన్నారు. చివరి చూపు కోసం వచ్చిన ప్రముఖులందరూ కూడా మోహన్ బాబును ఓదార్చారు. మోహన్ బాబు కుంటుంబం మొత్తం దాసరి అంత్యక్రియలు పూర్తయ్యే వరకూ అక్కడే ఉన్నారు.
సొంత కుటుంబ సభ్యులు కంటే ఎక్కువగా మోహన్ బాబు చొరవ తీసుకుని దాసరి అంత్య క్రియలు నిర్వహించాడు. ప్రతి పనీ తనే పురమాయించి సవ్యంగా జరిగేలా చూశాడు. దాసరి అంతిమ యాత్రలో కూడా ఆయన వెంటే ఉన్నారు. దహన సంస్కరాల్లో పాల్గొని దాసరి చితి పూర్తిగా కాలే వరకూ అక్కడే ఉన్నారు.
తననింత వాన్ని చేసింది దాసరేనని, ఏమి చేసినా ఆయన రుణం తీర్చుకోలేనని మోహన్ బాబు తనను పరామర్శించిన వారి వద్ద కన్నీళ్లు పెట్టుకున్నాడు.