తెలుగు రాష్ట్రాల్లో పచ్చ పార్టీకి ఏ కష్టమొచ్చినా అసలు తట్టుకోలేడు పాపం ఆంధ్రజ్యోతి రాథాకృష్ణ.. ఆపార్టీతో ఆయనున్న అనుబంధం అలాంటిది మరి.. సైకిల్ మీద తిరిగే ఒక సాధారణ రిపోర్టర్ గా ఉన్న తనను ఆడి కారులో ఆఫీసుకు వచ్చే స్థాయికి తీసుకొచ్చిన చంద్రబాబు రుణం ఎలా తీర్చుకోవాలా అన్న ఆలోచనతో నిత్యం కిందా మీదా పడిపోతుంటాడు దమ్మున్న చానల్ చైర్మన్. టీడీపీకి గానీ, దాని అధినేత బాబుగారికి గానీ ఏ చిన్న ఇబ్బంది తలెత్తినా ఆ పార్టీ కార్యకర్తలు కూడా అసూయ పడేలా చొరవ తీసుకుని బాబు గారిని ఆ ఇబ్బందుల నుంచి బయటపడేసి తన స్వామి భక్తిని చాటుకునేందుకు తెగ తాపత్రయపోతుంటాడు.
మరి అంతగా తను ఆరాధించే నాయకుడికి ప్రతిపక్ష నేత జగన్ ఈ మధ్య గట్టి ఝలక్ ఇచ్చాడు. ప్రధాని మోదీని కలిసి రాష్ట్రంలో చంద్రబాబు అండ్ బ్యాచ్ భాగోతాలను పేపర్ వర్క్ సహితంగా అందజేశాడు. దీంతో తెలుగు తమ్ముళ్లలో ఒక్కసారిగా కలవరం మొదలైంది. అసలు వారి కంటే అధికంగా భాదపడిపోయాడు రాధాకృష్ణ. ఇలాంటి సమయంలో క్లిష్ట సమయంలో పాపం బాబను తాను తప్ప ఎవరు ఆదుకుంటారని తనలో తానే ప్రశ్నించుకుని ఎలాగైనా సైకిల్ కి అయిన పంచర్లకు ప్యాచర్లు వేసే పనికి నడుంబిగించాడు. అదిగో సరిగ్గా అప్పుడే ఆయనికి ఒక లేఖ దొరికింది. ఈడీ అధికారులు చంద్రబాబుకు తొత్తులుగా మారి చట్టాన్ని అతిక్రమించి, ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేందుకు ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారో వివరిస్తూ గత ఫిబ్రవరిలో ప్రధాని మోదీకి ప్రతిపక్షనేత జగన్ రాసిన లేఖ అది. అంతే ఇక కోతికి కొబ్బరికాయ దొరికినట్టు ఆ లేఖను పట్టుకుని తన బుద్ధికి పనిచెప్పాడు.
జగన్ నాలుగు రోజుల క్రితం మోదీని కలిసినప్పుడు ఆయనిచ్చిన వినతి పత్రం ఇదేనంటూ రంకు కట్టేశాడు. అమ్మ జగనా అంటూ ఒక హెడింగ్ పెట్టేసి ఆ లేఖను ఎంతగా వక్రీకరించవచ్చో అంత చేసి తన పత్రికలో అచ్చేసుకుని హమ్మయ్య జగన్ మీద బురదజల్లాం, బాబు కళ్లలో ఆనందం చూశాం అని అల్పానందం పొందాడు. ఎలాంటి సోర్సు, ఆధారాలను ఉటంకించకుండా తను దగ్గరుండి స్వయంగా చూసినట్టు జగన్ ప్రధానితో ఏమేమి మాట్లాటాడు... ఆయన్ని ఏమని సంబోధించాడు..ఆయన దగ్గర ఎంత వినయంతో వ్యవహరించాడు అన్నది కళ్లారా చూసిన వాడు కూడా వివరించలేని విధంగా తన పత్రికలో రాసుకొచ్చాడు.
ఇష్టారీతిని ఉన్నది లేనిది పోగేసి జగన్ను ఆడిపోసుకోవడం, ఆయన మీద ప్రత్యర్థి పార్టీలను మించి ఆక్రోషం వెల్లగక్కడం పచ్చకామెర్లతో బాధపడుతున్న ఆర్కేకి కొత్తేమీ కాదు. పత్రికా స్వేచ్ఛ కోసమైనా ఈ దమ్మున్నోడి ఆగడాలను ఇన్ని రోజులూ భరిస్తూ వచ్చిన వైసీపీ ఆయనగారి పైత్యాన్ని తట్టుకోలేక చివరికి పార్టీ కార్యాలయం, కార్యకలాపాల నుంచి వెలివేసింది. ఇకపై తమ మంచి చెడ్డలకు ఆర్కే గారి దమ్మున్న చానల్, పత్రికా విలేకరులను ఆహ్వానించబోమని ప్రకటించింది. ఎవరేమనుకుంటే నాకేంటి ..మా బాబుగారి బాగే నాకు ముఖ్యం అనుకునే రాధాకృష్ణ రేపటి నుంచి తన పచ్చ పత్రికలో ఇంకెన్ని వికృత చేష్టలు ప్రదర్శిస్తాడో చూడాలి.