చీప్‌ లిక్కర్‌.. చీఫ్‌ మినిస్టర్‌: రోజా పంచ్‌

కాల్‌ మనీ.. చీఫ్‌ మినిస్టర్‌.. 'కా.మ. సీ.ఎం.'

- వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా, కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌ వెలుగుచూసిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై దుమ్మెత్తిపోసిన తీరు ఇది. 

శుద్ధ పప్పు.. వెర్రిపప్పు.. వడ్డాణం మంత్రి.. ఇలా చెప్పుకుంటూ పోతే, రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడంలో రోజా, ఒకప్పటి సినీ 'ట్రెండ్‌'ని ఇప్పటికీ కొనసాగిస్తుంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీడీపీలో వున్నప్పుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పంచె మీద కూడా పంచ్‌లు వేసేసి, పొలిటికల్‌గా తన ఇమేజ్‌ పెంచుకున్నారు రోజా.

రాజకీయాల్లో వాగ్ధాటి అవసరమే.. ఆ విషయంలో రోజా రెండాకులు ఎక్కువే చదివేశారు. అయితే ఒక్కోసారి ఈ వాగ్ధాటి ఆమె కొంప ముంచేస్తుందనుకోండి.. అది వేరే విషయం.

ఇక, అసలు విషయానికొస్తే, చీప్‌ లిక్కర్‌.. చీఫ్‌ మినిస్టర్‌.. అంటూ టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, వైఎస్సార్సీపీ ప్లీనరీ వేదికగా రోజా చెలరేగిపోయారంతే. చీఫ్‌ లిక్కర్‌కి చీఫ్‌ మినిస్టర్‌ చంద్రబాబే బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిపోయారని రోజా విమర్శించడంతో ప్లీనరీకి హాజరైన వైఎస్సార్సీపీ శ్రేణులు కొత్త ఉత్సాహంతో ఊగిపోయారు.

ఆంధ్రప్రదేశ్‌ని మద్యాంధ్రప్రదేశ్‌గా చంద్రబాబు మార్చేయాలనుకుంటున్నారనీ, క్యాబినెట్‌లో వున్నవారంతా తాగుబోతులేననీ.. రోజా ఓ రేంజ్‌లో చెలరేగిపోయారు. వైఎస్‌ జగన్‌ సహా, మిగతా పార్టీ నేతలంతా చేసిన ప్రసంగాలు ఓ ఎత్తు.. రోజా చేసిన ప్రసంగాలు ఇంకో ఎత్తు. ఈ రోజు ప్లీనరీలో రోజా రాజకీయ విమర్శలే హైలైట్‌ అని చెప్పుకోవచ్చేమో.

Show comments