అరవింద్‌ స్వామి పొలిటికల్‌ ఇంట్రెస్ట్‌

సినీ నటుడు అరవింద్‌ స్వామి ఈ మధ్యనే తెలుగులో 'ధృవ' సినిమాలో కన్పించిన విషయం విదితమే. 'రోజా', 'బొంబాయి' తదితర చిత్రాల్లో నటించి, అప్పట్లో రొమాంటిక్‌ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అరవింద్‌ స్వామి, ఎందుకో చాలాకాలం నటనకు దూరమయ్యాడు. ఇప్పుడు వరుసగా సినిమాలకు కమిట్‌ అవుతున్న అరవింద్‌ స్వామి, తాజాగా సోషల్‌ మీడియాలో పొలిటికల్‌ కామెంట్స్‌తో టాక్‌ ఆఫ్‌ది కోలీవుడ్‌గా మారాడు. 

తమిళనాడులో భగ్గుమంటున్న రాజకీయాల నేపథ్యంలో అరవింద్‌ స్వామి 'స్పెషల్‌ ఇంట్రెస్ట్‌' అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. కమల్‌హాసన్‌, గౌతమి మీడియా ముందుకొచ్చి నిన్నంతా నానా హంగామా చేశారు. అయితే, అరవింద్‌ స్వామి వేరే రూట్‌ ఎంచుకున్నాడు. ఎడా పెడా సోషల్‌ మీడియాలో ప్రస్తుత తమిళ రాజకీయాలపై కామెంట్లు చేస్తూనే వుండడం గమనార్హం. 

శశికళ, తనకు మద్దతిస్తోన్న ఎమ్మెల్యేలను 'రిసార్టుల్లో దాచి వుంచడం'పై అరవింద్‌ స్వామి భలే సెటైర్లు వేశాడు. అంతేనా, ఎమ్మెల్యేల ఫోన్‌ నెంబర్లను పోస్ట్‌ చేసి, వారితో మాట్లాడమంటూ తన అభిమానులకి, తమిళ ప్రజలకీ సూచించాడు. 'ఎమ్మెల్యేలు మీ సేవకులు.. మీ ఉద్దేశ్యాలేంటో, మీ ఎమ్మెల్యేలు ఎటువైపు వుండాలనుకుంటున్నారో మీరు వారికి చెప్పండి..' అంటూ తమిళ జనాలకి హితబోధ చేశాడు అరవింద్‌ స్వామి. 

పన్నీర్‌ సెల్వంకి పూర్తి మద్దతు ప్రకటిస్తూ.. శశికళపై సెటైర్లు వేస్తూ.. అరవింద్‌ స్వామి కొనసాగిస్తున్న 'ట్వీట్ల పరంపర'కు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇంతకీ, అరవింద్‌ స్వామి ఎందుకింత పొలిటికల్‌ ఇంట్రెస్ట్‌ చూపుతున్నట్లు.? ఏమో మరి, ఆయనకే తెలియాలి.

Show comments